గతేడాది విజయనగరం జిల్లా కంటకాపల్లి జంక్షన్ వద్ద విశాఖపట్నం పలాస ప్యాసింజర్ రైలు రాయగడ ప్యాసింజర్ రైలును వెనుకనుండి ఢీకొన్న ఘటన తెలిసిందే. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా సుమారు 100 మందికి పైగా గాయపడ్డారు. కాగా ఈ ఘటనకు మానవ తప్పిదమే కారణమని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలను వెల్లడించిన రైల్వే మంత్రి తీసుకున్న చర్యలను కూడా వివరించారు.
ప్రమాదం జరిగిన సమయంలో లోకో పైలట్లు విశాఖపట్నం పలాస ప్యాసింజర్ రైలు నడుపుతూ సెల్ఫోన్లో క్రికెట్ చూశారని తద్వారా డ్రైవింగ్ పై పట్టు కోల్పోయారని దానివల్లే రాయగడ ప్యాసింజర్ రైలును ఢీకొట్టారని లోకోపైలెట్ల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన లోకో పైలెట్, అసిస్టెంట్ లోకో పైలెట్ మీద చర్యలు తీసుకున్నామని అనంతరం దేశవ్యాప్తంగా రైళ్లను నడుపుతున్న లోకో పైలెట్లను నిత్యం పర్యవేక్షించేలా కొత్త వ్యవస్థను రూపొందించి అమలు చేస్తున్నామని అశ్వినీ వైష్ణవ్ వివరించారు.
కాగా గత సంవత్సరం అక్టోబర్ 29న విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద రాయగడ ప్యాసింజర్ సిగ్నల్ కోసం ఆగి ఉన్న సమయంలో వెనుక నుంచి విశాఖపట్నం పలాస ప్యాసింజర్ ఢీకొనడంతో 14 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరిపిన కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అధికారులు మానవ తప్పిదమే ప్రమాదానికి కారణమని నివేదిక ఇచ్చారు.