వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ పెనమలూరులో మరోసారి వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తామన్నారు. తనకు అవకాశమిచ్చిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం సీట్లు కేటాయించిన ఘనత జగన్కే దక్కుతుంది. వచ్చే ఎన్నికల్లో 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్ధానాలు గెలుస్తాం. మా బలహీనవర్గాలు సీఎం జగన్కి ఓటు వేసి రుణం తీర్చుకుంటాం. సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు.
– మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బోండా ఉమ ప్రజల స్థలాలు ఆక్రమించాడు. ఇక్కడ వైఎస్సార్సీపీ భారీ మెజారిటీ సాధిస్తుందన్న నమ్మకం నాకుంది. సీట్ల ప్రకటనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మా పార్టీ పెద్దపీటlవేసింది. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీని, ఆయన కుటుంబాన్ని తిట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడితో పవన్ పొత్తు ఎలా పెట్టుకున్నారు? కాపులను మోసం చేసిన వ్యక్తి ఆయన. రాజకీయల్లో సీఎం జగన్ విలువలకు ప్రాధాన్యత ఇస్తారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించాం. అందుకే గెలుపుపై నమ్మకం ఉంది.
– మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ నాకు గాజువాక నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు సీఎం జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు. విశ్వసనీయతే ప్రామాణికంగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకోని చంద్రబాబుకు, ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న జగన్కు మధ్య ఎన్నికల యుద్ధం జరగబోతుంది. ప్రజలే మా స్టార్ క్యాంపెయినర్లు. ఢిల్లీ నుంచి, సినిమా హీరోలు వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. అందువల్లే గతం కంటే ఎక్కువ మంది బీసీ, మైనార్టీ అభ్యర్థులకు అవకాశం కల్పించారు.
– జగ్గంపేట వైఎస్సార్సీపీ అభ్యర్థి తోట నరసింహం మాట్లాడుతూ రాజకీయంగా నాకు పునర్జన్మ ఇచ్చిన జగన్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. సీటు ప్రకటించినందుకు నా కుటుంబమంతా రుణపడి ఉంటుంది. దేశ చరిత్రలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ సీట్లకు ఒకేసారి ప్రకటించడం సామాన్య విషయం కాదు. జగన్కు చాలా దమ్ము, ధైర్యం ఉంది కాబట్టే ప్రకటించారు. 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వడం గొప్ప నిర్ణయం. ప్రజలంతా దీనిని హర్షించాలి.