విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లను పేద, వెనుక బడిన వర్గాల విద్యార్థులకు కేటాయించాల్సి ఉంది. దీని ప్రకారం ఏపీలో ఉన్న ప్రైవేటు స్కూళ్లలో ఫ్రీ సీట్ల కేటాయింపు కోసం అడ్మిషన్ల ప్రక్రియకు మార్చి 30 వరకు గడువు పొడిగించారు. ముందుగా ఈ గడువు మార్చి 14 వరకు ఉండగా ప్రస్థుతం 30 వరకు పెంచారు.
ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని అనుసరించి 2024- 2025 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో అన్ని ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం పేద విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అందులో భాగంగా ఒకటో తరగతిలో ప్రవేశానికి ఈ నెల 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బా రావు మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు.
పేద విద్యార్థులు కార్పొరేట్ స్థాయిలో పాఠశాలల్లో చదువుకునే అవకాశాన్ని విద్యా హక్కు చట్టం కింద ప్రభుత్వం కల్పిస్తోందని పేర్కొన్నారు. కార్పొరేట్ స్కూల్స్ లో ఒకటో తరగతిలో ప్రవేశానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని, ఈ మేరకు షెడ్యూల్ ను విడుదల చేసిందని వివరించారు.
ఫిబ్రవరి 23 నుంచి ఈ నెల 30వ తేదీ వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు.
ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న అనాథలు, హెచ్ఐవీ బాధితులు, విభిన్న ప్రతిభావంతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల పిల్లలకు విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు స్కూళ్లలో ఉచిత సీట్లు కేటాయిస్తున్నట్లు అధికారులు తెలిపారు.