మనం తరచూ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కోసం చూస్తూ ఉంటాం, అలాంటి సన్నివేశం కర్నూల్ జిల్లాలో జరిగింది. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గానికి చెందిన ఒక విద్యార్థిని రెండు సంవత్సరాల క్రితం బాల్య వివాహాన్ని ఎదిరించి స్థానిక వైసీపీ నాయకుల సహకారంతో చదువుకొని , నిన్న విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో టాపర్ గా నిలిచి రాష్ట్రం దృష్టిని ఆకర్శించింది .
ఆదోని నియోజకవర్గానికి చెందిన నిర్మల అనే విద్యార్థిని పదవ తరగతి పూర్తయిన తర్వాత ఉన్నత చదువులు చదివించలేము అని భావించిన తల్లిదండ్రులు పెళ్లి చేయాలని భావించారు. నిర్మలకు ముగ్గురు అక్కలు కాగా అందరికీ ఇదే తరహాలో వాళ్ళకి పదవ తరగతి పూర్తి అవ్వగానే పెళ్లి చేశారు. నిర్మల అక్కలకు పెళ్లి చేసిన విధంగానే నిర్మలకు కూడా పెళ్లి చేయాలని నిర్ణయించి , పెళ్లి చేసే దిశగా అడుగులు వేస్తున్న సందర్భంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్ రెడ్డి నిర్మల ఇంటికి వెళ్ళాడు.
అప్పుడు నిర్మల తనకు ఉన్నత చదువులు చదువుకోవాలని ఉందని , దానికి కావాల్సిన సాయం తనకు చేయాల్సిందిగా విన్నవించుకుంది. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఆ అమ్మాయి చదువుకు అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా కలెక్టరును కోరడం, ఆ అమ్మాయిని ఓ కళాశాలలో చేర్చడం అన్నీ చకచకా జరిగిపోయాయి. నిన్న విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో ఆ అమ్మాయికి 440 మార్కులకు 421 మార్కులు వచ్చాయి. పదో తరగతిలో కూడా 600 మార్కులకు 537 మార్కులు సాధించింది.