అనకాపల్లికి చెందిన కొణతాల రామకృష్ణ జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. బుధవారం హైదరాబాద్లో పవన్ కళ్యాణ్తో భేటీ అయిన ఆయన మంచిరోజు చూసుకుని పార్టీలోకి వస్తానన్నారు. ఈయన సీనియర్ రాజకీయ నాయకుడు. మంత్రిగా పనిచేశారు. అయితే నిలకడలేని మనస్తత్వం ఉన్న నేతగా పేరు తెచ్చుకున్నారు. 1980 దశకం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 1989, 1991 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేశారు. 1996 సంవత్సరంలో చింతకాయల అయ్యన్న పాత్రుడి చేతిలో ఓడిపోయారు. 1999లో అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి దాడి వీరభద్రరావు చేతిలో ఓడిపోయారు. తిరిగి 2004లో దాడిపై గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో శాసనసభకు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ప్రజారాజ్యం అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చేతిలో ఓటమి పాలయ్యారు.
కాగా ఈయన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. వైఎస్సార్కు సన్నిహితుడైన రామకృష్ణ ఆయన మరణానంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట నడిచారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో విశాఖ పార్లమెంట్ ఇన్చార్జిగా వ్యవహరించారు. తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించారు. 2019 ఎన్నికల సమయంలో ఆ పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే ఎందుకో వెనకడుగు వేశారు. చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న వ్యక్తి నేడు జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. గవర సామాజిక వర్గానికి చెందిన రామకృష్ణ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా చేస్తారని ప్రచారం జరుగుతోంది.
అయితే ఈయన చాలాకాలం క్రితమే అవుట్ డేటెడ్ లీడర్గా పేరు పొందారు. పైగా జనాదరణ కూడా చాలా తక్కువ. ఎక్కువ కాలం కాంగ్రెస్లో ఉన్నా ఆ తర్వాత స్థిరత్వం లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు టికెట్ ఇస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. జనసేన ఎంపీ టికెట్లు ఎక్కువ కావాలని అడుగుతున్న బాబు మాత్రం వాటిని బేరం పెట్టారు. ఎవరు ఎక్కువ డబ్బిస్తే వారికే ఇస్తానని చెప్పినట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొణతాల చేరినా ఆయనకు ఆశించిన ఫలితం ఉండకపోవచ్చని తెలుస్తోంది.