సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.
మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు.
2024–25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను మంత్రిమండలి ఆమోదించింది. నంద్యాల జిల్లా డోన్లో కొత్తగా హార్టికల్చరల్ పుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది . డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్శిటీ పరిధిలో ఈ హార్టికల్చరల్ పాలిటెక్నికల్ కళాశాల పనిచేయనుంది. నంద్యాల జిల్లా డోన్లో వ్యవసాయరంగంలో రెండేళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ పరిధిలో ఈ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల పనిచేయనుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రేవేట్ యూనివర్శిటీస్ (ఎస్టాబ్లిస్మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ 2016కు సవరణలు చేయడం ద్వారా బ్రౌన్ఫీల్డ్ కేటగిరిలో మూడు ప్రేవేట్ యూనివర్శిటీలకు కేబినెట్ అనుమతించింది. అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్శిటీ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్ యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీల ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 05–02–2024 నాడు ఉభయసభలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్ ప్రసంగానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.