జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఇంతకాలం నమ్మిన కొందరు కాపు సామాజికవర్గం నేతలకు ఆయన నిజస్వరూపం అర్థమైంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకురావాలని పనిచేస్తున్నాడని స్పష్టమైపోవడంతో సేనానిని వదిలేస్తున్నారు. టీడీపీతో పొత్తు వద్దన్నా వినకుండా పెట్టుకోవడం.. పవర్ షేరింగ్ అడగకుండా తక్కువ సీట్లకే పరిమితం కావడంతో ఆ వర్గం వారు చాలా కోపంగా ఉంది.
జనసేన వైఖరిపై విసుగెత్తి సొంత పార్టీకి చెందిన రాయలసీమ మహిళా నాయకురాలు పసుపులేటి పద్మావతి, ఆమె తనయుడు సందీప్ రాయల్ బయటికొచ్చారు. చంద్రబాబు పల్లకి మోస్తున్న సేనాని వైఖరి నచ్చక తండ్రీకూతురు ఆకుల వెంకటస్వామి, ఆకుల జయకల్యాణి గుడ్బై చెప్పారు. ఇలా జరగడం కొత్తేమి కాదు. 2014 నుంచి ఇప్పటి వరకు చాలామంది పవన్ నుంచి దూరం జరిగారు.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో కలిపేయడంతో కాపు నేతలు ఆవేదనకు గురయ్యారు. జనసేన పెట్టాక పవన్ రాజ్యాధికారం సాధిస్తాడని కొందరు నమ్మారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయినా 2024లో అయినా సీఎం అవుతాడని కలలు కన్నారు. కానీ సేనాని ఆలోచనలన్నీ బాబు కోసమని తేలిపోయింది. ఇటీవల ఉమ్మడి సభలో తనకు బలం లేదని తేల్చి చెప్పేశారు. దీంతో కరడు కట్టిన కాపు మేధావులు, నాయకులు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికే హరిరామజోగయ్య, ముద్రగడ పద్మనాభం, దాసరి రాము సూచనలు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో సేనాని కాడి వదిలేశారు.
జనసేనలో చేరాక అక్కడ పరిస్థితులు చూసి బయటికి వచ్చిన వాళ్లు ఉన్నారు. వారిలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్, తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీS రామ్మోహన్ రావు, చింతల పార్థసారథి, విజయ్బాబు, అద్దేపల్లి శ్రీధర్, మాకం రాఘవయ్య, మాదాసు గంగాధరం, చింతా రాజశేఖర్ తదితరులున్నారు. ఇంత మంది వెళ్లిపోతున్నా సేనాని మాత్రం లోపం ఎక్కడుందో తెలుసుకోలేకపోతున్నారు. తనను ప్రశ్నించే వారు వద్దని చెబుతున్నారు. ఎంత చాకిరి చేసినా చంద్రబాబు ఎదగనివ్వడనేది సత్యం. చివరికి కాపు ద్రోహిగా పవన్ మిగిలిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి.