‘నిర్మొహటంగా చెబుతున్నా నేను కాపుని. ఆ సామాజిక వర్గంలో పుట్టాను. మన కులం నుంచి ఎవరూ సీఎం అవ్వలేదు. మీరు ఓటు వేయండి నేను అవుతా’ ఒకానొక సందర్భంలో నాయకులతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ పలుకులు పలికారు. కాపులకు ప్రతినిధిని నేనేనని చెప్పుకొనే సేనాని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి కాళ్ల ఆ సామాజిక వర్గ గౌరవాన్ని తాకట్టు పెట్టారు. వారికి వెన్నుపోటు పొడిచారు. దీంతో ఆ వర్గమంతా పవన్ను పక్కన పెట్టేయాలని నిర్ణయించుకుంది.
ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనమైన తర్వాత కాపు నాయకులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. పవన్ జనసేన పెట్టడంతో వారికి ఆశాకిరణంగా కనిపించాడు. కానీ 2014లోనే ఆయన నిజస్వరూపం బయటపడింది. చంద్రబాబును సీఎంను చేసేందుకు పనిచేస్తున్నాడని తేలిపోయింది. దీంతో 2019 ఎన్నికల్లో కాపులు సేనానిని పట్టించుకోలేదు. బాబు కూడా అధికారం కోల్పోయాడు. 2024లో ఎలా అయినా టీడీపీని గద్దెనెక్కించాలని కంకణం కట్టుకున్న పవన్ మళ్లీ కాపులను మచ్చిక చేసుకునేందుకు కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరిగాడు. రాజ్యాధికారం వస్తుందేమోనని ఆ సామాజిక వర్గం నాయకులు నమ్మారు. కానీ ఇటీవల చంద్రబాబు జనసేనకు 24 సీట్లే ఇవ్వడం.. అందులోనూ కొన్ని లాక్కునేందుకు చూస్తుండటంతో సేనాని మనల్ని మళ్లీ మోసం చేశాడని కాపు పెద్దలు భావిస్తున్నారు. ఎప్పటి నుంచో కలగా ఉన్న రాజ్యాధికారాన్ని చిరంజీవి తమ్ముడు సాధిస్తాడనుకుంటే అతను మళ్లీ బాబునే సీఎం చేయాలని చూస్తున్నాడని అర్థం చేసుకున్నారు.
పొత్తులో ఎక్కువ సీట్లు తీసుకోవాలని, పవర్ షేరింగ్ అడగాలని మొదటి నుంచి కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య పవన్కు లేఖలు రాస్తున్నారు. సీట్లు ఎవరికి ఇవ్వాలో పేర్లు కూడా చెప్పారు. కానీ సేనాని పట్టించుకోలేదు. కేవలం 24 సీట్లు తీసుకున్నాక జోగయ్య తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కాపు యువత నిన్ను తమ ప్రతినిధిగా చూస్తున్నారని, కనీసం రెండున్నర సంవత్సరాలు అధికారం తీసుకోవాలని, మంత్రి పదవుల్లో సమాన వాటా అడగాలని సూచించారు. కానీ తాడేపల్లిగూడెం ఉమ్మడి సభలో ఈ పెద్దాయన పేరు ఎత్తకుండానే వార్నింగ్ ఇచ్చాడు పవన్. తన వారైతే ప్రశ్నించరని, ఏమి చేసినా వెంట నడుస్తారని చెప్పుకొచ్చారు. కాపు సామాజిక వర్గం బాగుండాలని, వారి ద్వారా బడుగులకు మంచి జరగాలని భావించి హరిరామ ఇచ్చిన సూచనలు సేనానికి రుచించలేదు. దీంతో జోగయ్య నొచ్చుకుని తన సలహాలు నచ్చకపోవడం వాళ్ల ఖర్మ.. చేయగలింది ఏమీ లేదని చెప్పేశారు.
మాజీ మంత్రి, సీనియర్ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం కూడా పవన్ వైఖరితో నొచ్చుకున్నారు. ఈయన జనసేనలో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ ఇది సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. గూడెంలో సేనాని మాటలు విన్నాక ముద్రగడ స్పందించారు. పవన్ నిర్ణయాలు ఆయన చేతిలో ఉండవని తేలిపోయిందన్నారు. 80 సీట్లు తీసుకుని, ముందుగా రెండేళ్లు సీఎం చేయమని చంద్రబాబును కోరి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఆ 24 సీట్ల కోసం ఇక నేనేందుకని ప్రశ్నిస్తూ లేఖ రాశారు.
కాపు జేఏసీ నాయకుడు కల్వకొలను తాతాజీ కూడా పవన్ తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. పొత్తులో భాగంగా కనీసం 50 స్థానాలు తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 24కే పరిమతం కావడం కాపు సామాజిక వర్గానికి అవమానకరంగా ఉంది. సీఎం పదవిలో షేరింగ్ లేదని తేలిపోవడం చాలా బాధగా ఉందని వ్యాఖ్యానించారు. ఇంకా జిల్లాల్లోని కాపు నాయకులు పవన్ కళ్యాణ్ నిర్ణయం సరికాదన్నారు. అతడి మాటలు ఇక పట్టించుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు.
మెజార్టీ స్థానాలు తీసుకోకుండా.. పవర్ షేరింగ్ అడకుండా చంద్రబాబును వెనుకేసుకొస్తూ.. సొంత సామాజిక వర్గ నేతల్నే పవన్ తిట్టారు. దీంతో రాష్ట్రంలోని కాపు నాయకులంతా రగిలిపోతున్నారు. అతని వల్ల రాజ్యాధికారం సాధ్యం కాదని నిర్ధారించి కాడి కింద పడేసందుకు సిద్ధమయ్యారు. అతడిని బాగు చేయలేమని, చంద్రబాబు చేతిలో కీలుబొమ్మని ముద్రగడ, జోగయ్య కూడా తేల్చేశారు. పవన్ బొమ్మ పెట్టినా కాపుల ఓట్లు రాలవని ఐక్య వేదిక చంద్రబాబుకు బహిరంగ లేఖ రాసింది.
పవన్ పూర్తిగా చంద్రబాబు మాయలో ఉన్నారు. డబ్బు కోసం సొంత సామాజిక వర్గానికే వెన్నుపోటు పొడుతున్నాని భావిస్తున్న కాపు యువత సోషల్ మీడియాలో సేనానిని చెడుగుడు ఆడుకుంటోంది. అయినా అతనిలో మార్పు రాదు. మరో మీటింగ్లోనూ బాబు కోసం కాపు నేతల్ని తిట్టి ఆయన్ను ఆనందపరుస్తాడు.