కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ ఎంపీ హరిరామజోగయ్య జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు మరో లేఖ రాశారు. ఇటీవల మంగళగిరిలో చంద్రబాబు జయహో బీసీ అనే సభను నిర్వహించారు. ఇందులో సేనాని కూడా పాల్గొన్నారు. ఉభయ పార్టీలు కలిసి బీసీ డిక్లరేషన్ పేరుతో పది ఎన్నికల హామీలిచ్చాయి. పవన్ 11వ హామీగా రాజ్యాధికారం కోసం యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి తెస్తానంటూ బీసీలకు చెప్పారు. ఇందుకు జోగయ్య కాపు డిక్లరేషన్ ఎప్పుడు ప్రకటిస్తారంటూ లేఖ విడుదల చేశారు. జనాభాలో 25 శాతం ఉన్న కాపు, బలిజ, ఒంటరి కులస్తుల ఆర్థిక, సామాజిక పరిస్థితులపైనా చర్చించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. బీసీలకు ప్రకటించిన హామీలతో సమానంగా కాపులకూ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
పనిలో పనిగా కొన్ని సీట్లు ఎవరికి ఇవ్వాలో హరిరామ మరో లేఖలో సూచించారు. మదనపల్లి సీటును శ్రీరామ రామాంజనేయులు, తిరుపతిని ఆరణి శ్రీనివాస్, రాజంపేటను ఎంవీ రావు, అనంతపురంను టీసీ వరుణ్, పుట్టపర్తిని శివశంకర్కు, తంబళ్లపల్లెని కొండా నరేంద్ర, గుంతకల్లును మణికంఠకు కేటాయించేలా చూడాలన్నారు. ఇందులో తంబళ్లపల్లె సీటును చంద్రబాబు జయచంద్రారెడ్డికి, గుంతకల్లు సీటును గుమ్మనూరు జయరామ్కు ఇస్తున్నట్లు చెప్పారు. అసలు ఆ రెండు చోట్ల టికెట్ల కేటాయింపుపై టీడీపీలో గొడవలు జరుగుతున్నాయి. ఇప్పటికి సేన 5 స్థానాల్లో అభ్యర్థులు ఎవరో ప్రకటించింది. మిగిలిన 19 బాబు ఎక్కడిస్తే అక్కడ తీసుకోవాల్సిన దుస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పవన్ను వెళ్లి ఇప్పటికే ఇచ్చేసిన సీట్లు అడగమంటే అది సాధ్యమయ్యే పనేనా..
మొన్నటి వరకు ఎన్ని సీట్లు తీసుకోవాలి, ఏ స్థానాల్లో పోటీ చేయాలో జోగయ్య లేఖలు రాస్తూ వచ్చారు. వాటిని పవన్ ఏనాడూ పట్టించుకోలేదు. కేవలం 24 మాత్రమే తీసుకోవడంతో పెద్దాయన నిన్ను బాగు చేయలేమని, కాపుల ద్రోహివని సేనానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తులో జనసేన పాత్ర అంతంతమాత్రమే. ఆ పార్టీ అధ్యక్షుడు హామీలపై ఏవైనా సూచనలిస్తే చంద్రబాబు పట్టించుకునే పరిస్థితి లేదు. కాపులకు మంచి చేసే ఉద్దేశం టీడీపీకి లేదు. మొన్నటి వరకు సూచనలు ఇచ్చినా పట్టించుకోని సేనాని ఈసారి జోగయ్య డిమాండ్లకు తలొగ్గుతాడా అనేది అనుమానమే.