నెల్లూరు సిటీ స్థానం మాజీ మంత్రి పొంగూరు నారాయణదే. ఈ విషయంలో ఎవరికీ అనుమానాలు అక్కర్లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దాని జోలికి రామని చెప్పేశారు. రూరల్ స్థానం నుంచి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పోటీ చేస్తాడని టీడీపీ మౌత్ పీస్ ఆంధ్రజ్యోతి ఖరారు చేసేసింది. అసలు జిల్లాలో ఎక్కడా సేనకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆ ఊహ కూడా చేయొద్దని తెలుగు తమ్ముళ్లు ఖరాఖండిగా చెప్పేశారు. అయితే స్థానిక జనసేన నేతలు మాత్రం గంపెడు ఆశలతో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా సినీ నృత్య దర్శకుడు జానీ మాస్టర్ను తెచ్చారు. ఆయనది సిటీ నియోజకవర్గమే. ఇక్కడ ఉండడు. సినిమాల్లో బాగా బిజీ. రాజకీయాలపై, ఇప్పటి వరకు జరిగిన పనులపై పూర్తిగా అవగాహన లేని వ్యక్తి. అయితే సీటు రాకపోయినా కనీసం ఉనికి అయినా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి కదా అని నేతలు జానీని ముందుపెట్టి కార్యక్రమాలు చేస్తున్నారు. శనివారం నెల్లూరులోని టిడ్కో ఇళ్ల వద్ద సేన గ్యాంగ్ హంగామా చేసింది. ఈ సమయంలో జానీ తమ నేతలు ఇచ్చిన స్క్రిప్ట్ చదివేసి అభాసుపాలయ్యారు. టిడ్కో గృహాలను పూర్తిగా కట్టకుండా ప్రవేశాల పేరుతో నాడు చంద్రబాబు హంగామా చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక పనులన్నీ పూర్తి చేయించి కొన్నింటిని రూపాయికే రిజిస్ట్రేషన్ చేసి అప్పగించారు. మరికొన్నింటికి లబ్ధిదారులపై రుణభారం తగ్గించారు. ఇళ్లను నివాసయోగ్యంగా మార్చారు. ఇయితే ఇవేమీ తెలియని జానీ గత ప్రభుత్వం కట్టిన వాటిని ఇవ్వలేదని, లబ్ధిదారులకు శఠగోపం పెట్టారని నిజం తెలుసుకోకుండా అన్నారు. ఆ ఇళ్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయని పేదలు నివాసం ఉంటున్న వాటిపై చులకనగా మాట్లాడారు. సినిమాల్లో బిజీగా ఉండే వ్యక్తి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ ఫలాల గురించి తెలుసుకోకుండా జగన్ వచ్చాక అంతా రివర్స్ అయ్యిందని అవగాహన లేమితో అన్నారు. వాస్తవానికి సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ప్రభుత్వం నుంచి నిధులు సాధించి నగరాన్ని అభివృద్ధి చేశారు. అయితే మరోచోట ఆయన సేవలు అవసరమని పార్టీ భావించి నరసారావుపేట ఎంపీకి పంపింది. ఒకరకంగా ఇది ఆయనకు జగన్ ఇచ్చిన ప్రమోషన్. అయితే జానీకి మాత్రం అనిల్ గ్రాఫ్ పడిపోవడంతో తరిమేశారని అనిపించింది.
తాను రాజకీయాల్లో వచ్చానని జనానికి చెప్పేందుకు జానీ మాస్టర్ తప్పుడు కార్యక్రమాన్ని ఎంచుకున్నారని విమర్శలున్నాయి. సినిమా వాడిని కదా పవన్ పిలిచి అసెంబ్లీ సీటు ఇస్తాడని భావించినట్లున్నారు. కానీ ఇంకా తమ అధినేత సంగతి పూర్తిగా తెలిసినట్లు లేదు. అంత సీన్ లేదయ్యా. మీ వాళ్లు నిన్ను రెచ్చగొడుతున్నా గానీ.. పవన్ కార్పొరేటర్ సీటు కూడా ఇవ్వడు. అలా స్క్రిప్ట్ చదివి నవ్వులపాలయ్యే బదులు విషయాలు పూర్తిగా తెలుసుకోవాలి. ఎక్కడైనా సమస్య ఉంటే పోరాటం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే అర్థం ఉంటుంది. అప్పుడు నువ్వు కూడా హీరో అవుతావు. ఈ ఎన్నికల్లో మీకు టికెట్ రాదు. ఈ విషయాన్ని జీర్ణించుకుని మీ వాళ్ల మాటలు పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉండండి. అలా కాకుండా చిల్లర రాజకీయాలు చేస్తే జనం నాలుగు రోజులు కూడా ఉంచరు. ఛీ కొట్టి తరిమేస్తారు.