ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన చేర్చాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామ/వార్డు సచివాలయాలను 2019 అక్టోబర్ 2వ తేదీన ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యం సాకారమైంది. ఇవి ఎంతోమంది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాయి. ఏళ్ల తరబడి ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం నిరీక్షించిన యువతకు కొలువులు తెచ్చిపెట్టాయి. పైసా ఖర్చు లేకుండా.. ఏ రాజకీయ నాయకుడి సిఫార్సు అవసరం లేకుండా సొంతూరిలో ఉన్నత స్థాయిని అందించాయి. కన్నవారికి దగ్గరగా.. స్థానిక ప్రజలకు సేవలందించే అవకాశాన్ని కల్పించాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 15,004 సచివాలయాలు ఉండగా వాటిల్లో 1.34 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు.
ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు 2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు ఆచరణకు సాధ్యం కాని హామీలిచ్చారు. జాబు రావాలంటే బాబు రావాలి.. ఇంటికో ఉద్యోగం ఇస్తామని పదేపదే చెప్పారు. ఇది నమ్మి టీడీపీకి ఓటు వేసిన నిరుద్యోగులను మోసం చేసి నట్టేట ముంచారు. కనీసం ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారు. దీంతో ఆయన హయాంలో నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసిన యువత రోడ్లపైకి వచ్చి అనేక సార్లు ధర్నాలు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. నిరుద్యోగ భృతిని అధికారంలోకి వచ్చిన వెంటనే కాకుండా కేవలం 2019 ఎన్నికల ముందు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు.
జగన్ వచ్చాక..
సీఎం వైఎస్ జగన్, నిరుద్యోగులు ఎలాంటి ఆందోళనలూ చేయకుండానే నోటిఫికేషన్లు ఇచ్చారు. సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పక్కాగా ఉండాలనే లక్ష్యంతో ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ జారీ చేసి పారదర్శకంగా నిర్వహించారు. సుమారు 1,200 కుటుంబాలకు ఒక సచివాలయం చొప్పున ఏర్పాటు చేశారు. వాటిలో అడ్మిన్, వీఆర్, విలేజ్ సెక్రటరీ, వెల్ఫేర్, డిజిటల్, శానిటరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, సివిల్ ఇంజినీరింగ్ అసిస్టెంట్, సర్వేయర్, ఫిషరీస్, పశు సంవవర్థక శాఖ తదితర శాఖ ఉద్యోగులను నియమించారు.
సచివాలయాలకు అనుసంధానంగా వలంటీర్లను తీసుకొచ్చారు. ప్రజల ఇంటి ముంగిటకు సంక్షేమ పథకాలను చేర్చేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ వ్యవస్థను 2019 ఆగస్ట్ 15వ తేదీన ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇళ్లకు.. పట్టణ ప్రాంతాల్లో ప్రతి 70-100 ఇళ్లకు ఒకరు చొప్పున వ్యాప్తంగా 2.61 లక్షల మందికి పైగా వలంటీర్లు ఉన్నారు. వారిలో 56 శాతం మంది మహిళలే. మొత్తం 80 శాతానికి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలే ఉన్నాయని గ్రామ, వార్డు సచివాలయ శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. ఈ వలంటీర్లంటే వేరే ఎక్కడి వారో కాదు. ఏ ఊరి వాళ్లనే ఆ ఊరిలో ప్రభుత్వం నిబంధనల ప్రకారం నియమించింది.
వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు సమయంలోనే దీన్ని అడ్డుకోవడానికి ఎల్లో గ్యాంగ్ హైకోర్టుకు వెళ్లింది. అప్పట్లో కోర్టు ఆ కేసును కొట్టేయడంతో రాష్ట్రంలో ప్రజలందరూ వారి సేవలు పొందుతున్నారు.