జనసేన ఉత్తరాంధ్ర పార్టీ కార్యాలయం మూసివేత
జనసేన పార్టీ భవిష్యత్తు కూడా అంతేనా.. ???
టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల పొత్తుల వల్ల సీట్లు దక్కకపోవడంతో ఆ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ళు కష్టపడ్డా ఫలితం లేకపోవడంతో వారి బాధను మీడియా ముందు వెల్లగక్కడమే కాకుండా.. తమని మోసం చేసిన పార్టీకు రాబోయే ఎన్నికలలో ఎలాంటి సహాయమూ చెయ్యమూ అంటూ స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. 2024 ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన సమయంలో కొంతమంది నాయకులు సీటు రాకపోవడంతో కార్యాలయాల ఖర్చు, అద్దె కూడా వృథా అని భావించి పార్టీ కార్యాలయాలను ఖాళీ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో జనసేన ఉత్తరాంధ్ర పార్టీ కార్యాలయం మూతపడింది. ఉత్తరాంధ్రలో పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు విశాఖలోని మాధవధార ప్రాంతంలో ఏర్పాటు చేసిన జనసేన కార్యాలయాన్ని కొద్ది రోజులుగా తెరవడంలేదు. ఇప్పుడు కార్యాలయం భవనాన్ని అద్దెకిస్తామంటూ భవనం యజమాని టు లెట్ బోర్డు పెట్టారు. పార్టీ కార్యాలయం ఖర్చును భరించేందుకు స్థానిక నేతలెవరూ ముందుకు రాకపోవడం, కనీసం అద్దె కూడా చెల్లించకపోవడంతో భవనం యజమాని పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయించినట్టు సమాచారం.
ఇన్నాళ్లూ డబ్బు ఖర్చుపెట్టుకొన్న తమను పొత్తులు, కొత్తవారికి సీట్లతో దెబ్బ తీశారని నాయకులు కుతకుతలాడుతున్నారు. పొత్తులో భాగంగా విశాఖ దక్షిణం, పెందుర్తి, యలమంచిలి, అనకాపల్లి సీట్లు జనసేనకు వచ్చాయి. పార్టీలో మొన్ననే చేరిన వంశీకృష్ణకు విశాఖ దక్షిణ స్థానాన్ని, అంతకుముందు చేరిన పంచకర్లకు పెందుర్తి, నిన్న చేరిన కొణతాలకు అనకాపల్లి సీటు కేటాయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలో మొదటి నుండి పనిచేసిన తమను కాదని కొత్తగా వచ్చిన వారికి పెద్దపీట వేయడాన్ని జనసేన నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఇప్పటికే అనకాపల్లి నేత పరుచూరి భాస్కర్రావు, పెందుర్తి నేత కంచిపాటి కాశీవిశ్వనాథనాయుడు పార్టీకి రాజీనామ చేశారు. మరికొందరు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు.నేతలెవ్వరూ జనసేన ఉత్తరాంధ్ర పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి చూడటంలేదు. ఆ భవనం అద్దె కూడా వృథా అని భావించి, అద్దె కట్టడం మానేసినట్లు సమాచారం.
జనసేన కార్యాలయం మూతపడటం ఇది రెండోసారి. గతంలో నరసింహనగర్ రైతుబజార్ సమీపంలోని అపార్టుమెంట్లో పార్టీ కార్యాలయం ఉండేది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ కార్యాలయాన్ని మూసివేశారు. కొద్ది రోజులు పార్టీ కార్యాలయం లేకుండానే కాలం వెళ్లదీశారు. రెండేళ్ల క్రితం మాధవధారలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యాలయం కూడా ఇప్పుడు మూతపడటంతో ఉత్తరాంధ్రలో జనసేన పరిస్థితి ఏంటో అర్ధమవుతుంది. పొత్తులతో నాయకులను, కార్యకర్తలను మోసం చేసిన టీడీపీ, జనసేన పార్టీలకు రానున్న ఎన్నికలలో తగిన సాస్తి జరుగుతుందని ఆ పార్టీల నేతలు తిట్టిపోస్తున్నారు.