2024 సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో కీలకమవుతుందనుకున్న పవన్ కళ్యాణ్ జనసేన పాత్ర నామమాత్రంగానే మిగిలింది. కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ నుండి పోటీ చేస్తున్న పంతం నానాజీకి పక్కనే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ బలం అవుతుంది అని అనుకుంటే.. నానాజీ అభ్యర్థిత్వం పై తీవ్ర వ్యతిరేక ప్రభావాన్ని చూపింది.
నేడు ఎన్నికల నామినేషన్ వేయడానికి బయలుదేరిన పంతం నానాజీ పై గంపెడాశలతో ఎదురు చూసిన జనసేన క్యాడర్ కి నిరాశ మిగిలింది. అట్టహాసంగా జరగాల్సిన నామినేషన్ కార్యక్రమం చాలా నిరుత్సాహంగా, నిర్వీర్యంగా జరిగింది. తండోపతండాలుగా కిక్కిరిసిన జన సమూహం మధ్య జరుగుతుందని కలలు కన్న కార్యక్రమం చాలా పేలవంగా మిగిలిపోయింది. నియోజకవర్గంలో ఏమాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది.
సాధారణంగా ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియ అనేది అభ్యర్థులు తమ బలాబలాలను చూపించుకునే ఒక అవకాశం గా భావిస్తారు. తమ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపి గెలుపు దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతుంది. అయితే నానాజీ నామినేషన్ ప్రక్రియ అందుకు భిన్నంగా అత్యంత నిరుత్సాహంగా ముగిసింది. ఈరోజు జరిగిన నామినేషన్ ప్రక్రియకి వచ్చిన జనాన్ని చూస్తే రేపు జరిగే ఎన్నికల్లో ఏమాత్రం పోటీని ఇచ్చే పరిస్థితిలో లేకుండా తేలిపోయింది. కనీసం మండల స్థాయి నాయకుడికి వచ్చే జనం కూడా రాకపోవడంతో జన సైనికులు ఉసూరుమన్నారు .