కానీ గుండెల నిండా ధైర్యం ఉందంటూ జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చెప్పిన చిలక పలుకులను నమ్మిన అభిమానులు, కార్యకర్తల ఆశలను చిదిమేయడానికి పవన్ ఎంతో కాలం తీసుకోలేదు. ఏ క్షణాన పార్టీ పెట్టాడో కానీ అప్పటి నుండి జనసేనను అద్దెకిచ్చే పార్టీగా మార్చేయడమే కాకుండా కేవలం చంద్రబాబు ప్రయోజనాల కోసం పార్టీని నడపడం మినహా ఈ పదేళ్లలో పవన్ కళ్యాణ్ సాధించిన ఘనతేమీ లేదు.
2014లో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉంది. కేడర్ ని ఏర్పాటు చేసుకోవడం, ఎన్నికలకు సమాయత్తమవడం కష్టం కాబట్టి చంద్రబాబుకు భేషరతుగా మద్దతు ఇవ్వడంలో అర్ధం ఉంది. కానీ ఐదేళ్లల్లో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టకుండా ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పుకుంటూ కూడా అధికార పార్టీ చేస్తున్న అక్రమాలపై స్పందించకుండా కేవలం ప్రతిపక్షాలపై దాడిని కొనసాగిస్తూ ఐదేళ్ల కాలం గడిపిన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల ముందు చంద్రబాబుకు ఎదురుతిరిగినట్లు నాటకం ఆడాడు.
కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకే చంద్రబాబుతో విభేదించాడని టీడీపీ ప్రయోజనాలకోసమే పవన్ పార్టీని నడిపిస్తున్నాడని విమర్శలు వచ్చినా పవన్ వెనుకడుగు వేయలేదు. దాంతో పవన్ పై చిర్రెత్తిపోయిన అభిమానులు, ప్రజలు ఆయన్ను చిత్తుగా ఓడించారు. పోటీ చేసిన రెండు చోట్లా పవన్ ని ఓడించిన ప్రజలు ఆయనకు గట్టి బుద్ది చెప్పారు. అయినా సరే పవన్ లో రాజకీయ స్థిరత్వం వచ్చిన దాఖలాలు కనబడలేదు. ఈసారి ఎన్నికలకు చంద్రబాబుతో పొత్తు కోసం వెంపర్లాడుతూ వెర్రెత్తిపోయిన పవన్ తన పార్టీని నమ్ముకున్న నేతలను, కార్యకర్తలను బకరాలు చేసాడు.
ముందుగా పొత్తులో భాగంగా మూడొంతుల సీట్లలో పోటీ చేస్తున్నామని గర్వంగా ప్రకటించి జనసేన నేతలలో ఆశలను రగిల్చిన పవన్ కొందరు నేతలకు సీటు హామీని కూడా ఇచ్చేసారు. తీరా 24 సీట్లలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించి జనసేన నాయకులకు షాక్ ఇచ్చారు. గాయత్రీ మంత్రానికి 24 అక్షరాలని ఆవేశంగా ఊగిపోయిన రెండు రోజుల్లోపే 21 సీట్లకు పరిమితం కావడం జనసేన నేతల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. కనీసం ఆ 21 సీట్లలో అయినా పార్టీని మొదటి నుండి అంటిపెట్టుకుని నమ్మకంగా పనిచేస్తున్న నాయకులకు ఇచ్చారా అంటే అదీ లేదు. విడివాడ రామచంద్రరావు, పోతిన మహేష్, కాకినాడ మాజీ మేయర్ సరోజ, బొలిశెట్టి సత్యనారాయణ , పాఠంశెట్టి సూర్యతేజ వంటి నేతలకు మొండి చెయ్యి చూపించి వారి ఆవేదనకు పవన్ కారణమయ్యాడు.
ముందుగా సీటు హామీ ఇవ్వడం దేనికి తర్వాత మొండి చేయి చూపడం ఎందుకంటూ పలువురు జనసేన నేతలు వాపోతున్నారు. జనసేనకు దక్కిన ఆ 21 సీట్లలో జనసేనకు అండగా ఉన్న నేతలు పోటీ చేస్తున్నారా అంటే అదీ లేదు. ఇప్పడు జనసేన సీటు దక్కని టీడీపీ నేతల పునరావాస కేంద్రంగా మారిపోయింది. దాదాపు పది సీట్లలో టీడీపీ నుండి వచ్చిన నేతలే పోటీ చేస్తుండడం పార్టీని మొదటి నుండి అంటిపెట్టుకుని ఉన్న నేతలకు మింగుడుపడటం లేదు. జనసేన అధినేత ఇలాగే తన ధోరణి కొనసాగిస్తే జనసేన ఎన్నికల్లో సీటు దక్కని అభ్యర్థులకు అద్దెకిచ్చే పార్టీగా మారిపోతుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా పవన్ కళ్ళు తెరిచి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెడితే బావుంటుందని జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నారు. మరి వారి ఆశ నెరవేరుతుందా అంటే కష్టమే అని చెప్పాలి.