2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ మోహన్ రెడ్డి ప్రజారోగ్య రంగంలో ఎవరు ఊహించని విధంగా విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రజల ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం మొదలుపెట్టారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రభుత్వ వైద్యులని గడప గడపకు పంపి ప్రతి ఒక్కరికి ఏడు రకాల టెస్టులు చేయించి వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ విధంగా ఇంటింటికి వెళ్లి వైద్యం చేసి ట్రాక్ చేయడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. యాక్సెస్ టూ హెల్త్ కేర్ లో నూటికి నూరు శాతం అందుబాటులో ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే.
జగనన్న ఆరోగ్య సురక్ష 2023 డిసెంబర్ మధ్యకు మొదటి దశను పూర్తి చేసుకుంది. మొదటి దశలో జేఏఎస్ ద్వారా 60 లక్షలు మందికి ప్రభుత్వం వైద్య సేవలు అందించింది. జేఏఎస్ రెండో దశలో 30 లక్షల మందికి వైద్య సేవల అందించాలనే లక్ష్యంతో ఈ ఏడాది జనవరిలో రెండో దశను ప్రారంభించారు. రెండో దశ కార్యక్రమంలో అనుకున్న షెడ్యూల్ ప్రకారం గ్రామాలు, వార్డుల్లో శిబిరాలను ఏర్పాటు చేసి, స్పెషలిస్ట్ వైద్యుల ద్వారా ప్రభుత్వం ప్రజలకు సేవలందిస్తోంది. ప్రతి జిల్లాలో సగం మండలాల్లో మంగళవారం, మిగిలిన సగం మండలాల్లో శుక్రవారం శిబిరాలు నిర్వహిస్తున్నారు. పట్టణ, నగరాల్లో బుధవారం శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో మండలంల వారానికి ఒక గ్రామం చొప్పున, పట్టణాల్లో ఒక వార్డు చొప్పున ఆరు నెలల్లో రాష్ట్రం మొత్తం శిబిరాలను నిర్వహించేలా కార్యాచరణ రూపొందించారు.
జేఏఎస్ 2 లో భాగంగా ఇప్పటి వరకూ 7,974 శిబిరాలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో 5,929 శిబిరాలు, పట్టణ ప్రాంతాల్లో 2,045 శిబిరాలు నిర్వహించారు. ఒక్కో శిబిరంలో సగటున 362 మంది చొప్పున 28,79,408 మందికి ఇప్పటి వరకూ వైద్య సేవలందించారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 1.63 లక్షలు, నంద్యాలలో 1.51 లక్షలు, వైఎస్సార్ జిల్లాలో 1.44 లక్షల మంది ప్రజలు వైద్యం చేయించుకున్నారు.జేఏఎస్ –2 లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 13,954 శిబిరాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికి జగనన్న ఆరోగ్య సురక్ష 65 శాతం శిబిరాలను పూర్తి చేసుకుంది.
వైద్య పరీక్షల నిర్వహణకు 7 రకాల కిట్లను, ఈసీజీ, ఇతర పరికరాలను, వందల సంఖ్యలో మందులను శిబిరాల్లో అందుబాటులో ఉంచారు. శిబిరాలకు వద్దకు వచ్చి సేవలు అందుకున్న వ్యక్తుల్లో సుమారు 13 వేల మందికి ఆస్పత్రుల్లో చికిత్సలు అవసరమని వైద్యులు నిర్ధారించి, దగ్గరలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేశారు. వారందరినీ ఆస్పత్రులకు తరలించి వైద్య సేవలందించేలా స్థానిక పీహెచ్సీ వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 5 వేల మంది ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందుకున్నారు. ప్రజలకు సొంత ఊళ్లలోనే స్పెషలిస్ట్ వైద్య సేవలందించేందుకు 543 మంది జనరల్ మెడిసిన్, 645 మంది గైనకాలజీ, 349 మంది జనరల్ సర్జన్లు, 345 ఆర్థోపెడిక్, 378 మంది ఇతర స్పెషలిస్ట్ వైద్యులు, 3 వేల మంది వరకూ వైద్యులు, కంటి సమస్యల గుర్తింపునకు 562 మంది ఆప్తాల్మిక్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు. ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఇంకా రెండు నెలలకు పైగా కొనసాగనుంది.