రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరగడం లేదని ప్రతిపక్షాలు చాలాకాలంగా గగ్గోలు పెడుతున్నాయి. కానీ అదంతా నిజం కాదు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అనేక పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని రామాయపట్నంలో ఇండోసోల్ ఈనెలాఖరు నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. సదరు సంస్థ సౌర విద్యుత్ కేంద్రాలకు అవసరమైన మాడ్యూల్స్, ప్యానెళ్లు, ఇతర పరికరాలను తయారు చేస్తుంది. ఇది షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (ఎస్ఎస్ఇఎల్) అనుబంధ సంస్థ. తొలిదశ ప్లాంట్ ప్రారంభోత్సవ వివరాలను ఆ కంపెనీ సీఈఓ శరత్చంద్ర వెల్లడించారు.
రామాయపట్నంలో ఏపీ ప్రభుత్వం పోర్టును నిర్మిస్తోంది. దీంతో ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. పోర్టు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. అత్యాధునిక సోలార్ మాడ్యూల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇండోసోల్కు జనవరి సుమారు 30 ఎకరాల భూమి కేటాయించింది. తొలిదశలో రూ.400 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈనెలాఖరు నుంచి 500 మెగావాట్ల సోలార్ పీవీ మాడ్యూళ్లను ఉత్పత్తిని చేయనున్నారు. ఇది అత్యాధునిక పూర్తి ఆటోమెటిక్ మాడ్యూల్ లైన్. దేశంలోనే తొలి గ్లాస్–గ్లాస్, బ్యాక్ షీట్ కాంబినేషన్ పెర్క్, టాప్కాన్, హెచ్ఐటీ మాడ్యూళ్లను తయారు చేస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి 4 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంటారు. ప్రభుత్వ సహకారంతో 2026 నాటికి పది గిగావాట్ల ఉత్పత్తి సాధించేందుకు ప్రణాళికలు వేశారు. అప్పటికి వీరికి 8 వేల ఎకరాల భూమి అవసరం అవుతుంది. మొత్తం పెట్టుబడుల విలువ రూ.25 వేల కోట్లు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 23 వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఈ యూనిట్ను ఏర్పాటు చేయడం ద్వారా తొలి దశలో కేంద్ర పీఎల్ఎ స్కీం కింద రూ.1,870 కోట్లు, రెండో దశలో రూ.3,300 కోట్ల చొప్పున ప్రోత్సాహకాలు అందుతాయి. భవిష్యత్లో పునరుత్పాదన ఇంధన రంగానికి భారీ డిమాండ్ ఉంటుందని, కడపలోని ఎస్– ఎస్ఈఎల్ ప్లాంట్లో రోజుకు 500కి పైగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను తయారు చేస్తున్నామని సీఈఓ వెల్లడించారు.