నేడు జగనన్న విద్య దీవెన పథకం నిధులు విడుదలలో భాగంగా భీమవరంలో జరిగిన బహిరంగ సభలో భీమవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గ్రంధి శ్రీనివాస్ పలు కీలక వ్యాఖలు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తూనే ప్రజలంతా ముఖ్యమంత్రి జగన్ కి అండగా ఉండాలని ఆకాక్షించారు. గ్రంధి శ్రీనివాస్ ఏమన్నారంటే
స్వాతంత్రోద్యమ సమయంలో భీమవరం పట్టణం మహాత్మా గాంధీచే రెండో బార్డోలిగా పిలువబడింది. భీమవరంలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. దివంగత మహానేత వైయస్సార్ గారు నాకు చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించారు. 2019కి ముందు ఎన్నికల్లో పోటీ చేయకూడదని అనుకున్నాను కానీ నువ్వు భీమవరం నుండి పోటీ చెయ్యి, గెలిచినా ఓడినా నీ వెంట నేనుంటానని ముఖ్యమంత్రి జగన్ నాకు ధైర్యం చెప్పారు. దాంతో అర్జునుడికి శ్రీ కృష్ణుడు తోడైనట్టు నేను ఒక జనసేన పార్టీ అధ్యక్షుడి(పవన్ కళ్యాణ్) మీద గెలిచాను. జగన్ కుటుంబానికి మేమెప్పుడూ రుణపడి ఉంటామని గ్రంథి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి.
చంద్రబాబుకు ఏనాడూ జిల్లాల వికేంద్రీకరణ గురించి ఆలోచన చేయలేదు. కానీ సీఎం జగన్ నూతన జిల్లాలను ఏర్పాటు చేయడమే కాకుండా జిల్లా కేంద్రంగా భీమవరాన్నిమార్చారు. నూతన జిల్లా కేంద్రం ఏర్పాటుతో భీమవరం ప్రతిష్టను పెంచిన సీఎం జగన్ కి జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గుర్రాలతో తొక్కించిన అంగన్వాడీలకు, పోలీసులతో కాల్పించిన రైతులకు, వెన్నుపోటు పొడిచిన మామ ఎన్టీఆర్ కు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి. కారంచేడు దళితులకు, వంగవీటి రంగా హత్య పట్ల ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం పేరుతో యువతను నయవంచన చేసిన వ్యక్తిగా చంద్రబాబు నిలిచిపోయాడు. రైతులు, పేదలు, మహిళలపై చంద్రబాబు కక్ష కట్టారు. ఆ చంద్రబాబుకు దత్తపుత్రుడు కూడా తోడయ్యాడని భీమవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.
మహాత్ముల ఫోటోల స్థానంలో చంద్రబాబు ఫోటో పెట్టుకున్న పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు అంబేడ్కర్, పూలే, మదర్ థెరిస్సా ఫోటోలు పెట్టుకున్నాడు. ఇప్పుడేమో ఆ మహాత్ముల ఫోటోలు తీసేసి వాటి స్థానంలో చంద్రబాబు నాయుడి ఫోటో పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ జన సైనికులు, కాపు యువతకు చంద్రబాబులో అంబేడ్కర్, పూలే, గాంధీ కనిపిస్తున్నారనే సందేశం ఇస్తున్నాడు. సీఎం జగన్ పేదలకు నవరత్నాల ద్వారా మేలు చేయాని తపన పడుతున్నారు. మంచి మనసు, ప్రేమాతత్వ హృదయంతో జగన్ పని చేస్తున్నారు. పేదలకోసం పరితపిస్తున్న ముఖ్యమంత్రి జగన్ కి ప్రజలంతా అండగా ఉండాలని గ్రంథి శ్రీనివాస్ వెల్లడించారు