ఏపీలో గ్లోబల్ సమ్మిట్(జీఐఎస్) కార్యరూపం దాలుస్తున్నాయి. తద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి అవకాశాలు దక్కనుండగా ఆంధ్రప్రదేశ్ ఆహార శుద్ధి పరిశ్రమల హబ్గా మారనుంది. ఇప్పటికే ఒప్పందాల్లో భాగంగా నాలుగు మేజర్ పరిశ్రమలు ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి.
గత సంవత్సరం గ్లోబల్ సమ్మిట్(జీఐఎస్)లో 33 ఒప్పందాలు జరిగాయి. వీటి విలువ దాదాపు రూ.5,765 కోట్లు. కాగా ప్రస్తుతం ఏడాదికి 11.90 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో రూ.1,350 కోట్ల పెట్టుబడితో నాలుగు పరిశ్రమలు ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. వీటి ద్వారా పరోక్షంగా 5,380 మందికి ఉపాధి లభిస్తుండగా, మరో 23 వేల మంది రైతులకు లబ్ది చేకూరనుంది. సీఎం జగన్ కృషితో గ్లోబల్ సమ్మిట్ ఒప్పందాల్లో దాదాపు 60% ఒప్పందాలు కార్యరూపం దాల్చనున్నాయి.
ఉత్పత్తిని ప్రారంభించిన పరిశ్రమల వివరాలు
1. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరం వద్ద గోద్రేజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ కంపెనీ రూ.100 కోట్లతో ఎడిబుల్ ఆయిల్ రిఫనరీ అండ్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ పరిశ్రమను ఏర్పాటు చేసింది. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 1,130 మందికి ఉపాధి లభిస్తుండగా, 5 వేల మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది.
2. తిరుపతిలోని శ్రీసిటీ వద్ద రూ.350 కోట్ల పెట్టుబడితో డీపీ కోకోవా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కోకో బట్టర్, ఫౌడర్, మాస్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేసింది. ఈ యూనిట్ ద్వారా 1,000 మందికి ఉపాధి లభిస్తుండగా, 18వేల మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది.
3. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెం వద్ద రూ.650 కోట్ల పెట్టుబడితో అనా ఓలీయో ప్రైవేట్ లిమిటెట్ సంస్థఎడిబుల్ ఆయిల్ మాన్యుఫ్యాక్చరింగ్ పరిశ్రమను ఏర్పాటు చేసింది. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 2,100 మందికి ఉపాధి లభిస్తుంది.
4. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం దొరువులపాలెం వద్ద రూ.250 కోట్ల పెట్టుబడితో గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ లిమిటెడ్ సంస్థ ఎస్పీఎస్ఆర్ ఎడిబుల్ ఆయిల్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసింది. ఏడాదికి 4.20 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమ ద్వారా 1,150 మందికి ఉపాధి కల్పిస్తోంది.
ఏలూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఏర్పాటైన నాలుగు ప్రధాన పరిశ్రమలతో పాటుగా మరో రూ.2,227 కోట్ల విలువైన ఆరు పరిశ్రమలు తిరుపతి, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, విజయనగరం జిల్లాల్లో శంకుస్థాపన పూర్తి చేసుకుని నిర్మాణ దశలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో వేగంగా ఆయా పరిశ్రమల నిర్మాణం జరుగుతుంది. ఈ పరిశ్రమల ఏర్పాటు ద్వారా 2,180 మందికి ఉపాధి లభించనుండగా, 24,100 మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూరనుంది.
నిర్మాణ దశలో ఉన్న పరిశ్రమలు
తిరుపతి జిల్లా వరదాయిపాలెం మండలం కువ్వకొల్లి గ్రామం వద్ద సీసీఎల్ ఫుడ్ అండ్ బేవరేజస్ కంపెనీ రూ.400 కోట్ల పెట్టుబడితో భారీ ఇన్స్టెంట్ కాఫీ యూనిట్కు శంకుస్థాపన చేసింది. ఈ పరిశ్రమ ద్వారా 950 మందికి ఉపాధి కల్పించనుండగా, 2,500 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
తిరుపతి శ్రీసిటీ వద్ద రూ.1,600 కోట్ల పెట్టుబడితో మోండెలెజ్ ఇండియా ఫుడ్స్ సంస్థ చాక్లెట్ ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది. ఈ పరిశ్రమ ద్వారా 500 మందికి ఉపాధి కల్పించనుండగా, 18వేల మంది రైతులకు లబ్ధి చేకూర్చనుంది.
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కొమ్మూరు వద్ద రూ.144 కోట్లతో శ్రీ వెంకటేశ్వర బయోటెక్ కంపెనీ మొక్కజొన్న పిండి తయారీ యూనిట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా 310 మందికి ఉపాధి కల్పించనుండగా, 1,500 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కొనాడ వద్ద బ్లూఫిన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ రూ.13 కోట్ల పెట్టుబడితో పొటాట చిప్స్, పాస్తా, నూడిల్స్ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తోంది. ఈ పరిశ్రమ ద్వారా 45 మందికి ఉపాధి లభించనుండగా, 100 రైతులకు లబ్ధి చేకూరనుంది.
అనకాపల్లి జిల్లా కొండవాటిపూడి వద్ద అరకు కాఫీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.20 కోట్లతో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తోంది. ఈ యూనిట్ ద్వారా 200 మందికి ఉపాధి కల్పించనుండగా, వెయ్యి మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మద్ది గ్రామం వద్ద ఒరిల్ ఫుడ్స్ సంస్థ రూ.50 కోట్ల పెట్టుబడితో ఇన్స్టంట్ విజిటబుల్ చట్నీస్ యూనిట్కు శంకుస్థాపన చేసింది. ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా 175 మందికి ఉపాధి కల్పించనుండగా, 1,000 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
ఇప్పటికే పూర్తైన పరిశ్రమల ద్వారా 5,380 మందికి ఉపాధి లభిస్తుండగా, మరో 23 వేల మంది రైతులకు లబ్ది చేకూరుతుండగా నిర్మాణ దశలో ఉన్న పరిశ్రమల ఏర్పాటు ద్వారా 2,180 మందికి ఉపాధి లభించనుండగా, 24,100 మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూరనుంది.