2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన కిమిడి నాగార్జున బొత్స సత్యనారాయణ చేతిలో పరాజయం పాలయ్యారు. 2014 ఎన్నికల్లో కూడా ఆ సీటును తనకే కేటాయిస్తారన్న ఆలోచనతో చీపురుపల్లి నియోజకవర్గంలో పార్టీ సంబంధిత కార్యక్రమాలను భుజాలపై ఎత్తుకున్నారు.
ఒకరేమో నాకా సీటొద్దు మొర్రో అంటున్నారు. మరొకరేమో ఆ సీటు నాకు ఇవ్వకుండా వేరొకరికి ఇస్తున్నారని అసంతృప్తితో రగిలిపోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న తాజా నిర్ణయం పట్ల ఇద్దరు టీడీపీ నాయకులు ఒకే సీటు విషయంలో తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఆ నియోజకవర్గమే చీపురుపల్లి. పార్టీ అధిష్టానం తీసుకున్న తాజా నిర్ణయంతో అసంతృప్తితో ఉన్న ఇద్దరు నేతల పేర్లు గంటా శ్రీనివాసరావు, కిమిడి నాగార్జున.
2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన కిమిడి నాగార్జున బొత్స సత్యనారాయణ చేతిలో పరాజయం పాలయ్యారు. 2014 ఎన్నికల్లో కూడా ఆ సీటును తనకే కేటాయిస్తారన్న ఆలోచనతో చీపురుపల్లి నియోజకవర్గంలో పార్టీ సంబంధిత కార్యక్రమాలను భుజాలపై ఎత్తుకున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న తపనతో తన కేడర్ ద్వారా ప్రజలకు చేరువ కావడానికి అన్నిరకాల కార్యక్రమాల్లో పాల్గొంటున్న కిమిడి నాగార్జునకి చంద్రబాబు షాక్ ఇచ్చారు. చీపురుపల్లిలో గంటా శ్రీనివారసరావును పోటీ చేయించే యోచనలో ఉన్నట్లు అందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని టీడీపీ అధిష్టానం ప్రకటించడంతో అక్కడ ఇన్ ఛార్జ్ గా ఉన్న నాగార్జునకి మొండిచెయ్యి చూపినట్లైంది. దీంతో ఆయన అసంతృప్తితో రగిలిపోతూ టీడీపీ అధినేతల ఫోన్లకు కూడా స్పందించడం లేదని వార్తలు వస్తున్నాయి.
కిమిడి నాగార్జునది ఒక బాధ అయితే గంటా శ్రీనివాసరావుది మరో బాధ. 2019 ఎన్నికల్లో వైసీపీ గాలిలో కూడా గెలిచిన గంటా శ్రీనివాసరావు, పార్టీ కనుమరుగయ్యే స్థితికి చేరుకోవడంతో టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. పార్టీ మారేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేశారు. శ్రీనివాసరావు కప్పదాటు ధోరణిపై గుర్రుగా ఉన్న చంద్రబాబు సమయం కోసం వేచి చూసారు. 2024 అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడిన నేపథ్యంలో భీమిలి టికెట్ ఆశించిన గంటా అక్కడ తన కేడర్ తో కలిసి ఎన్నికల్లో గెలుపుకు అన్ని కార్యక్రమాలను చక్కబెట్టుకున్నారు. ఇక అభ్యర్థిగా ఖరారై ప్రచారం చేయడమే తరువాయి అన్న దశలో భీమిలి టికెట్ విషయంలో బాబు మొండి చెయ్యి చూపించి చీపురుపల్లిలో పోటీ చేయాలని గంటాను ఆదేశించారు.
కాగా గంటా శ్రీనివాసరావు చంద్రబాబు ఆదేశాలకు ఎదురుతిరిగినట్లుగా పొలిటికల్ సర్కిల్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ లాంటి మాస్ లీడర్ పై పోటీ చేసి గెలవడం కష్టమని నన్ను కావాలని ఓడించడానికే అక్కడ సీటును కేటాయిస్తున్నారని గంటా శ్రీనివాసరావు సన్నిహితుల దగ్గర వాపోయినట్లు తెలుస్తుంది. గంటా పోటీకి నిరాకరించడంతో చంద్రబాబు ఆగ్రహంతో తనదగ్గర నుండి వెళ్ళిపోమని విరుచుకుపడ్డారని తెలుస్తుంది. భీమిలి తనకు సురక్షితమైన సీట్ అని కానీ చంద్రబాబు కావాలనే తనకు చీపురుపల్లిలో పోటీ చేయమని చెబుతున్నారని చంద్రబాబు నిర్ణయం పట్ల గంటా గుర్రుగా ఉన్నట్లు సమాచారం.
చీపురుపల్లిలో తనదైన కార్యక్రమాలతో ప్రజల్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేస్తున్న కిమిడి నాగార్జునకి టికెట్ నిరాకరించి తనకా సీట్ వద్దు మొర్రో అంటున్న గంటాను అక్కడనుండి పోటీ చేయమని బలవంతం చేయడం చంద్రబాబుకే చెల్లిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. వాడుకుని వదిలేయడం, ఏరు దాటాక తెప్ప తగలేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని తన నిర్ణయంతో ఇద్దరు నాయకుల కెరీర్ తో ఆడుకుంటున్నాడని సామాన్యులు కూడా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే కిమిడి నాగార్జున పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరి బాబు చెప్పినట్లు చీపురుపల్లిలో గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తారా లేక బాబుకు ఎదురుతిరుగుతారా అనే అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తమవుతున్నాయి.