మహిళా కమిషన్ సభ్యురాలుగా ఉన్న గజ్జల వెంకటలక్ష్మిని మహిళా కమిషన్ చైర్మన్ గా నియమించింది ప్రభుత్వం.ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా కమిషన్ చైర్మన్ గా ఉన్న వాసిరెడ్డి పద్మ ఇటీవల రాజీనామా చేసిన విషయం పాఠకులకు విదితమే. ఆమె రాజీనామా చేయడంతో చైర్మన్ పదవికి ఖాళీ ఏర్పడింది.
ఆ ఖాళీని భర్తీ చేయటానికి మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉన్న గజ్జల లక్ష్మిని చైర్మన్ చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకొన్నారు. గజ్జల లక్ష్మి మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమితం కావటానికి పూర్వం అణిచివేతకు, గృహ హింసకు గురి అవుతున్న, మానవ మృగాల అకృత్యాలకు బలవుతున్న ఎంతో మంది మహిళల వెంట తోడుగా నిలిచి వారికి న్యాయం చేయటం కోసం పలు పోరాటాలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు మహిళా కమిషన్ సభ్యురాలిగా భాద్యతలు చేపట్టిన గజ్జల లక్ష్మి ఆ తర్వాత మహిళలకు జరిగిన పలు అన్యాయాల పై స్పందించి వారికి న్యాయం జరిగేట్లు చేసిన కృషి రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలకు నోచుకొంది .
ఇటీవల జరిగిన గీతాంజలి బలవన్మరణం పై తీవ్రంగా స్పందించారు. గీతాంజలి సంఘటన గురించి తెలిసిన వెంటనే స్పందించి గీతాంజలి స్వగ్రామం వెళ్లి ఆ కుటుంబానికి మనోధైర్యం ఇవ్వటమే కాకుండా అందుకు భాధ్యులయిన వారి గురించిన సమాచారం తెలుసుకొని పోలీసు వర్గాలను అప్రమత్తం చేశారు. .రెండు సంవత్సరాలు క్రితం కడపలో ప్రేమ పేరిట ఒక మహిళను వేదిస్తే వెంటనే వెళ్ళి ఆ మహిళకు అండగా నిలిచారు.
ఇలా మహిళకు కష్టం వచ్చిన మరు క్షణమే , ఆ కష్టం తీర్చడానికి నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకుని నేనున్నా అంటూ అండగా నిలిచే మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి నేడు సీఎం గారి ఆదేశాల మేరకు మహిళా కమిషన్ చైర్మన్ గా భాద్యతలు స్వీకరించడం పై పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.