2024 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎలక్షన్ కమిషన్ నుంచి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అన్ని రాష్ట్రాలను పర్యటించి అక్కడ ఉన్న సమస్యలు ఒక్కొకటి కొలిక్కి తెస్తూ సిద్ధం అవుతున్న తరుణంలో చివరి ప్రక్రియగా ఎన్నికల నిర్వహించే అధికారులకి శిక్షణా కార్యక్రమం చేపట్టింది ఎలక్షన్ కమిషన్. ఈ శిక్షణ న్యూఢిల్లీ విగ్యాన్ భవన్ లో జరిగింది.
న్యూఢిల్లీ విగ్యాన్ భవన్లో భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యుటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ అధ్యక్షత ఎన్నికలకు సంబంధించి శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భారత ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ కేంద్ర పరిశీలకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా, న్యాయబద్ధంగా, బెదిరింపులకు, ప్రేరణలకు తావులేకుండా నిర్వహించడంలో కేంద్ర పరిశీలకులు తమ పరిధిలో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఎటువంటి సమస్యాత్మకమై విషయం ఎదురైనా, తక్షణ పరిష్కారానికి వెంటనే ఎన్నికల సంఘానికి నివేదించాలన్నారు. కేంద్ర పరిశీలకులు నిర్వహించాల్సిన విధి విధానాలపై సమగ్రమైన అవగాహన పెంచుకుని ఎన్నికలను ఎంతో పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని ఆయన కోరారు.
దేశవ్యాప్తంగా త్వరలో జరుగనున్న 2024 సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు దాదాపు 150 సీనియర్ ఐఏఎస్. ఐపీఎస్, ఐఆర్ఎస్. అధికారులను సాధారణ, పోలీస్ మరియు వ్యయ పరిశీలకులుగా ఎలక్షన్ కమిషన్ నియమించింది. కేంద్ర పరిశీలకులు నిర్వహించాల్సిన విధులు, అనుసరించాల్సిన విధి విధానాలపై సమగ్ర అవగాహన కలిగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది.శిక్షణా కార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన మొత్తం 66 మంది కేంద్ర పరిశీలకులు వర్చువల్, ఫిజికల్ విధానంలో పాల్గొని శిక్షణ పొందారు.
ఎన్నికల ప్రక్రియలోని పలు కీలక అంశాలకు సంబంధించి సంబంధిత అధికారులు పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా కేంద్ర పరిశీలకులకు వివరించారు. డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ (డి.ఇ.ఓ.) హిర్దేష్ కుమార్ ఎన్నికల పరిశీలన, ప్రణాళిక, ఓటర్ల జాబితా, పోలింగ్ సిబ్బంది శిక్షణ అంశాలను, డి.ఇ.ఓ. అజయ్ భాడో ఎన్నికల ప్రవర్తనానియమావళి, ఎన్నికల వ్యయ పర్యవేక్షణా అంశాలను, డి.ఇ.ఓ. ఆర్కే గుప్తా చట్టపరమైన నిబంధనలు, చట్టబద్దమైన ఆదేశాలను, మరో డి.ఇ.ఓ. నితేష్ వ్యాస్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వివిప్యాట్ల నిర్వహణ అంశాలను పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరించడంతో ఉదయం సెషన్ ముగిసింది. స్వల్ప విరామం తదుపరి ప్రారంభమైన ఈ శిక్షణా కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ (ఐటి అప్లికేషన్సు) నీతావర్మ ఎన్నికల ప్రక్రియలో వినియోగిస్తున్న పలు ఐటి అప్లికేషన్లను, డైరెక్టర్ జనరల్ (మీడియా) నారాయణన్ ఎన్నికల సమయంలో మీడియా, సోషల్ మీడియా పర్యవేక్షణా అంశాలను కేంద్ర పరిశీలకులకు వివరించారు.
ఈ శిక్షణా కార్యక్రమంకి మన రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాతో పాటు అదనపు సీఈవోలు పి. కోటేశ్వరరావు, ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్, కేంద్ర పరిశీలకులుగా నియమించబడిన 23 మంది ఐఏఎస్, 13 మంది ఐపీఎస్ అధికారులు, జాయింట్ సీఈవో ఎ.వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈవో కె. విశ్వేశ్వరరావు, అసిస్టెంట్ సీఈవోలు ఎస్ ఆంజనేయులు, పి. తాతబ్బాయ్ తదితరులు పాల్గొన్నారు.