సీట్ల విషయంలో తెలుగుదేశం పార్టీలో చెలరేగిన అసమ్మతి సెగలు ఇంకా చల్లారలేదు. అనేక నియోజకవర్గాల్లో అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేశ్పై తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటూనే ఉన్నారు. ఏదో అనుకుని టికెట్లు ప్రకటిస్తే ఇంకేదో జరుగుతోందని అధిష్టానం పెద్దలు ఆందోళన చెందుతున్నారు.
వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్మోహన్రెడ్డి పార్టీని చిత్తు చేస్తామన్న చంద్రబాబుకు ఇప్పుడు ఆ ప్రాంతంలో టీడీపీ పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కడప నియోజకవర్గ టికెట్ను మాధవీరెడ్డికి కేటాయించడంపై స్థానిక నేతలు గుర్రుగా ఉన్నారు. మంగళవారం అసమ్మతి నాయకులు సమావేశం నిర్వహించారు. సీనియర్ అయిన అలంఖాన్పల్లె లక్ష్మీరెడ్డి బాబు తీరును తప్పుపట్టారు. తన కోడలు, కార్పొరేటర్ ఉమాదేవికి సీటు ఇస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి వచ్చి కడప ఎంపీగా ఆయన, ఎమ్మెల్యే టికెట్ ఉమాదేవి పోటీ చేస్తామన్నారు. ఇప్పుడు మాధవీరెడ్డిని పెట్టారు. ఆమెను చిత్తుగా ఓడిస్తామని ప్రకటించారు. కడప మాజీ ఇన్చార్జి అమీర్బాబు మాట్లాడుతూ ఎంపీ టికెట్ తనకు ఇస్తానని చంద్రబాబు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలోని కొందరు నేతలు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వారి నాలుక చీరేస్తానని హెచ్చరించారు.
అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ పోటీ చేస్తారని టీడీపీ అధిష్టానం ప్రకటించడం పార్టీలో అగ్గిని రాజేసింది. గుంతకల్లు ఇన్చార్జి ఆర్.జితేంద్రగౌడ్కు మద్దతుగా కార్యకర్తలు ఆందోళన చేశారు. జయరామ్కు సహకరించేది లేదని ప్రకటించారు. టికెట్ల కేటాయింపులో చంద్రబాబు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జయరామ్ నుంచి రూ.150 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. పక్క జిల్లా నుంచి అభ్యర్థి తీసుకురావడం సిగ్గు చేటన్నారు.
శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలోనూ టీడీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ టికెట్ను సునీల్ కుమార్కు ఇవ్వడంతో ఇన్చార్జి గుండుమల తిప్పేస్వామి వర్గీయులు అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సునీల్ వద్దంటూ తిప్పేస్వామి ఇంటి నుంచి వాల్మీకి విగ్రహం వరకు ర్యాలీ చేశారు. బొమ్మయ్య గారి చంద్ర అనే కార్యకర్త కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. కొందరు మహిళా కార్యకర్తలు మెడకు ఉరితాళ్లు తగలించుకుని అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేశారు.
పార్టీలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే చంద్రబాబు గ్యాంగ్ అంతా బాగున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. పచ్చ పత్రికలకైతే ఇవి అసలు వార్తల్లాగే కనిపించడం లేదు. టికెట్లు ఇచ్చేశా.. వాళ్లలో వాళ్లే కొట్టుకు చస్తారనే విధంగా బాబు వ్యవహరిస్తున్నారని కార్యకర్తలు బాధ పడుతున్నారు.