తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా ప్రకటించిన అభ్యర్ధుల జాబితాతో రాష్ట్రవ్యాప్తంగా రాజుకున్న చిచ్చు ఇప్పటిలో చల్లారేలా కనిపించడంలేదు. పొత్తులో భాగంగా జనసేనకు గణనీయంగా సీట్లు వస్తాయని గంపెడాశలు పెట్టుకున్న క్యాడర్ ఆశలపై నీళ్ళు చల్లుతూ పవన్ కళ్యాణ్ తమకి కేవలం 24 నియోజకవర్గాల్లోనే పోటీ చేసే అవకాశం చంద్రబాబు కలిపించారని ప్రకటించడంతో ఒక్కసారిగా జనసేన నాయకులు , క్యాడర్ పూర్తిగా అసహనంలో మునిగిపోయింది. కొన్నిచోట్ల బహిరంగంగానే పవన్ కళ్యాణ్ తీరుని ఆ పార్టీ నాయకులే తప్పు పడుతుంటే, మరో చోట మాత్రం లోలోపల తమకి జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటూ రగిలిపోతున్నారు.
ఇప్పటికే కొత్తపేట, తణుకు, జగ్గంపేట, పెద్దాపురం , పీ గన్నవరం నియోజకవర్గాల్లో తమకి టికెట్లు రాకపోవడంతో అసహనంగా ఉన్న జనసేన క్యాడర్ నిన్నటిరోజున ఏకంగా జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల భాస్కరరావు పైనే దాడికి తెగబడ్డారు. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలోకి ఏలూరు కూడా వచ్చి చేరింది. ఏలూరులో రాజుకున్న అసమ్మతి కూడా ఇప్పటిలో తగ్గేలా లేదు.
ఏలూరులో కార్మిక నాయకుడుగా పేరొందిన రెడ్డి అప్పలనాయుడు జనసేన అధికార ప్రతినిధిగా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఏలూరు నియోజకవర్గంలో గడిచిన 5ఏళ్ల నుంచి జనసేన పార్టీని బలపరచడమే లక్ష్యంగా పనిచేస్తూ వచ్చారు. ఎన్నికల్లో పవన్ కళ్యాన్ తనకే టికెట్ ఇస్తారని గంపెడాశలు పెట్టుకుని పార్టీ కోసం పూర్తి సమయాన్ని వెచ్చించారు. అయితే ఇప్పుడు పొత్తులో భాగంగా ఇక్కడ టిక్కెట్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి బడేటి రాధాకృష్ణకు కేటాయించడంతో అప్పలనాయుడు అనుచరులు, జన సైనికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ నిర్ణయాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్న జనసైనికులు అప్పలనాయుడుని స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుమంటూ ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటివరకు అప్పలనాయుడు స్వయంగా తాను స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నట్లు ప్రకటించనప్పటికీ తెలుగుదేశంపార్టీ విజయానికి ఎంతమాత్రం సహకరించరని, రాబోయే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఖచ్చితంగా బరిలోకి దిగుతారని ఆయన అనుచర వర్గం చెబుతున్న మాట. ఏలూరు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.