స్మారక భవనం అన్న పవన్ మాటలు నీటి మూటలే..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వద్ద దామోదరం సంజీవయ్య గుర్తించి ప్రస్తావించి చూడండి. ఆయనెవరని ప్రశ్నిస్తాడు. అదేంటి సర్.. అప్పట్లో చాలా చెప్పారు కదా అంటే.. అదంతా మా రైటర్స్ ఇచ్చే స్క్రిప్ట్ రా అని నవ్వేస్తాడు. కొంతకాలం క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడానికి సంజీవయ్యను అడ్డం పెట్టుకున్న ఘనుడు సేనాని.
దామోదరం సంజీవయ్య.. కర్నూలు జిల్లాలో జన్మించిన ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన గొప్ప వ్యక్తి. రెండో ముఖ్యమంత్రి, తొలి దళిత సీఎం కూడా ఈయనే. అలాగే కాంగ్రెస్ పార్టీ తొలి దళిత అధ్యక్షుడు కూడా. 38 సంవత్సరాల పిన్న వయసులో సీఎం అయ్యారు. తన జీవిత కాలంలో అనేక కీలక పదవులు నిర్వర్తించారు. ప్రొవిజినల్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. మద్రాస్ స్టేట్లో ఎమ్మెల్యేగా, మంత్రిగా చేశారు. ఇంకా ప్రకాశం, బెజవాడ గోపాల్రెడ్డి, నీలం సంజీవరెడ్డి కేబినెట్లలో మంత్రిగా పనిచేసిన అనుభవముంది. 1960 నుంచి 1962 వరకు ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేశారు. కేంద్రంలో నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ కేబినెట్లలో ఈయనకు స్థానం దక్కింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. 2008లో విశాఖపట్నంలో స్థాపితమైన ఆంధ్రప్రదేశ్ నేషనల్ లా యూనివర్సిటీకి దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ అని పేరు మార్చారు.
జగన్ ప్రభుత్వం నివాళి
ఫిబ్రవరి 14న సంజీవయ్య జయంతి. దీనిని ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహించాలని జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వేడుకలను ఆయన జన్మించిన ప్రాంతం కర్నూలులో చాలా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతోపాటు అమరావతి, అన్ని జిల్లా కేంద్రాల్లోనూ సంజీవయ్య జయంతి నిర్వహించేందుకు అవసరమైన నిధులను కేటాయించి ఆ మహానుభావుడికి ఘనమైన నివాళులర్పించింది.
పవనుడు అంతే..
ప్రతి విషయాన్ని రాజకీయం చేయడమే పవన్ కళ్యాణ్కు తెలుసు. ఈ బుద్ధులు చంద్రబాబు నుంచి నేర్చుకున్నవే. సంజీవయ్యను కూడా తన రాజకీయ స్వార్థానికి వాడుకున్నాడు సేనాని. 2021లో ఓ సమావేశంలో ఆయన దామోదరం గురించి ప్రస్తావించారు. లండన్లో బీఆర్ అంబేడ్కర్ ఇంటిని మహారాష్ట్ర ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటుందో అదే విధంగా ఇక్కడ సంజీవయ్య నివాసాన్ని స్మారక భవనంగా తీర్చిదిద్ది కాపాడుకుంటానని ఘనంగా ప్రకటించారు. ఈ సమయంలో ప్రభుత్వంపై పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు. భవనం కోసం జనసేన నుంచి రూ.కోటితో నిధిని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఆయన గొప్పతనం భావితరాలకు తెలియజేయాలంటే స్మారక భవనం నిర్మించాల్సిన అవసరముందన్నారు. మేధావులతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం విరాళాలు కావాలని∙సోషల్ మీడియాలో జనసేన టీం పోస్టులు పెట్టింది. ఇది జరిగి మూడు సంవత్సరాలు అవుతున్నా ఇంత వరకు స్మారక భవనం ఊసేలేదు. జనసైనికులు, సామాన్యులు ఇచ్చిన విరాళాలు ఏ అజ్ఞాతవాసి బ్యాంక్ ఖాతాలోకి వెళ్లాయో అంతుచిక్కడం లేదు. ఈరోజు సంజీవయ్య జయంతి. ఇంత వరకు సేన కానీ, సేనానికి చెందిన సోషల్ మీడియా అధికారిక ఖాతాల్లో నివాళులర్పిస్తూ ఒక్క పోస్టు కూడా పెట్టలేదు. జగన్ ప్రభుత్వం నిధులు సమకూర్చి జయంతిని అధికారికంగా నిర్వహిస్తోంది. మాటలకు.. చేతలకు తేడా ఇదే.. గతంలో పవన్ చాలా సందర్భాల్లో డబ్బులిస్తా.. చూసుకుంటానని సభల్లో చెప్పారు. అది అంతవరకే పరిమితం. బయటికొచ్చి కారెక్కాక ఆ విషయాలను మర్చిపోయి తన పాటలు వింటూ వెళ్లిపోతాడు.