తెలుగుదేశం నాయకులకు తెలిసింది ఒకటే.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురద వేయడం. తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలి. ప్రతి జిల్లాలోనూ ఇదే తంతు జరుగుతోంది. పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని, సంక్షేమ పథకాలు తీసేశారని, అభివృద్ధి ఆగిపోయిందని.. ఇలా ఏదో ఒక విషయంలో దుష్ప్రచారం చేయడమే ఎల్లో నేతలు పనిగా పెట్టుకున్నారు. వారికి పచ్చ మీడియా సహకరిస్తోంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో ఉన్న అదానీ కృష్ణపట్నం పోర్టు విషయంలో తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అబద్ధపు ప్రచారం చేశారు. పోర్టులో కంటైనర్ టెర్మినల్ సేవలు నిలిచిపోయాయంటూ ఆయన ఆరోపించారు. ప్రభుత్వం, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి వల్లే ఇది జరుగుతోందన్నారు. 20 వేల మంది ఉపాధి కోల్పోతారని ఎల్లో మీడియా సహకారంతో జనాన్ని నమ్మించే యత్నం చేశారు. జనసేన, కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి అఖిలపక్షం పేరుతో ధర్నాలు చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని చూశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. కానీ ఆయనకు శుక్రవారం ఊహించని షాక్ తగిలింది.
నాలుగు వేల కంటైనర్లతో వెసల్ కృష్ణపట్నం పోర్టుకు చేరుకుంది. వాటిలో 2,800 దిగుమతి అయ్యాయి. దీంతో సోమిరెడ్డి చెప్పిందంతా సోది అని తేలిపోయింది. అధికారిక గణాంకాల ప్రకారం పోర్టులో ప్రస్తుతం జరుగుతున్న మొత్తం సరుకుల రవాణా 57.8 మిలియన్ టన్నులు. అసలు దేశంలోనే మొత్తం మేజర్ పోర్టులన్నీ కలిపి గతేడాది చేసిన సరుకుల రవాణా 795 మిలియన్ టన్నులు. అందులో కృష్ణపట్నం ద్వారానే అధికంగా జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. మూడు సంవత్సరాల క్రితం ఈ పోర్టులో 3.81 కోట్ల టన్నులుగా ఉన్న వార్షిక సరుకుల రవాణా ఇప్పుడు 5.78 కోట్ల టన్నులకు పెరిగింది. కరోనా మహమ్మారి సమయంలో ఎగుమతులు, దిగుమతులు తగ్గి ఇక్కడి నుంచి కంటైనర్ టెర్మినల్ కార్యకలాపాలను ఎన్నూర్, చెన్నై పోర్టుకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి గోవర్ధన్రెడ్డికి తెలిసింది. ఆయన వెంటనే ఈ విషయాన్ని సీఎం కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే కేంద్ర మంత్రికి లేఖ రాశారు. వైఎస్సార్సీపీ ఎంపీల ద్వారా ఒత్తిడి పెంచడంతో పోర్టు యాజమాన్యం కంటైనర్ టెర్మినల్ సేవలు నిలిపివేయడం లేదని తేల్చి చెప్పింది. అయినా సోమిరెడ్డి తన స్వార్థం కోసం ఈ అంశానికి రాజకీయ రంగు పూశారు. సర్వేపల్లి టికెట్ తెచ్చుకుని ఎన్నికల్లో గెలవడానికి కార్మికుల జీవితాలతో చెలగాటమాడారు.
తాజాగా 4,000 కంటైనర్లతో పోర్టులో లంగరు వేసిన కొలంబోకి చెందిన ‘ఎంఎస్సీ గినా’ అనే నౌకను మంత్రి కాకాణి పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. సోమిరెడ్డి తీరుపై విరుచుకుపడ్డారు. కంటైనర్ టెర్మినల్ తరలిపోతోందంటూ ఆయన చేసిన ఆరోపణలు నౌక రావడం ద్వారా అవాస్తవమని రుజువైందన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక కుట్రలకు తెరలేపారన్నారు.
కంటైనర్ టెర్మినల్ సేవలు మూతపడుతున్నాయంటూ డ్రామాలు ఆడారని గుర్తుచేశారు. అవాస్తవాలు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో భారీ కంటైనర్ల నౌకను రప్పించిన పోర్టు నిర్వాహకులను మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు సోమిరెడ్డి ఏం చెబుతారో.. ఈ విషయంలో రచ్చ చేసిన ఎల్లో మీడియాకు ఇప్పటికే మాట పడిపోయి ఉంటుంది. అబ్బా.. ప్రభుత్వాన్ని తిట్టడానికి ఇష్యూ దొరికిందని ఆనందించిన చంద్రబాబు అయితే సోమిరెడ్డి చేసిన నిర్వాకానికి ఆగ్రహం వ్యక్తం చేసి ఉంటారనడంలో సందేహం లేదు.