ఈనెల 6న ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ను జాతికి అంకితం చేయనున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన సాగనుంది.
ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఉదయం 9.30 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో పాల్గొని పైలాన్ ఆవిష్కరిస్తారు. తర్వాత వ్యూ పాయింట్ వద్ద నుంచి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పరిశీలన అనంతరం టన్నెల్ 2 ను పరిశీలిస్తారు. అనంతరం జాతికి అంకితం చేస్తారు. కార్యక్రమం తర్వాత మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రొటోకాల్ ప్రకారం బందోబస్తు ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఎస్పీ పరమేశ్వరరెడ్డి తెలిపారు. హెలిప్యాడ్, టన్నెల్ ప్రదేశంలో బ్యారికేడ్ల ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రోడ్లు, భవనాలశాఖ అధికారులకు సూచించారు. బందోబస్తు ఏర్పాట్లలో ఎటువంటి లోటు పాట్లు లేకుండా పక్కాగా చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. కలెక్టర్ ఏఎస్. దినేష్కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని విజయవంతం చేయాలని కోరారు. శాఖల వారీగా కేటాయించిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.