వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒంటరిగా బరిలోకి దిగుతున్నారు. ఆయన్ను ఢీకొట్టేందుకు ఒకనాటి ప్రత్యర్థులంతా ఏకమవుతున్నారు. అలాంటి వారిలో అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ, మాజీ మంత్రి, తెలుగుదేశం నేత దాడి వీరభద్రరావు ఉన్నారు. వీరి మధ్య చాలా ఏళ్లుగా రాజకీయ వైరం ఉంది. 1999లో దాడి టీడీపీ నుంచి పోటీ చేసి.. కాంగ్రెస్ అభ్యర్థి అయిన కొణతాలపై గెలిచారు. 2004లో కొణతాల.. దాడిపై విజయం సాధించారు.
రామకృష్ణ 1980 దశకం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 1989, 1991 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేశారు. 1996 సంవత్సరంలో చింతకాయల అయ్యన్న పాత్రుడి చేతిలో ఓడిపోయారు. 1999లో అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి దాడి వీరభద్రరావు చేతిలో ఓడిపోయారు. తిరిగి 2004లో దాడిపై గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో శాసనసభకు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ప్రజారాజ్యం అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చేతిలో ఓటమి పాలయ్యారు. కాగా ఈయన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు.
ఇక వీరభద్రరావు 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి అనకాపల్లిలో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. మళ్లీ 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో గెలిచారు. 2004, 09లో ఓడిపోయి 2013లో ఎమ్మోల్సీ అయ్యారు. ఆయన 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరి ఎన్నికల తర్వాత తెలుగుదేశం గూటికి చేరారు. 2019 మార్చిలో టీడీపీని వీడి మళ్లీ జగన్ పార్టీలో చేరారు. కొంతకాలం క్రితం చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు.
ఇద్దరు నేతలు అనేక పార్టీలు మారారు. చాలాకాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2024లో అనకాపల్లి టికెట్ను ఆశించారు. అయితే పొత్తులో భాగంగా ఆ సీటును జనసేనకు కేటాయించారు. దీంతో దాడి ఇంటికి కొణతాల శుక్రవారం ఉదయం వెళ్లి మద్దతు కోరారు. మీడియా ముందు ఒకరినొకరు పొగుడుకున్నారు. వాస్తవానికి వీరికి ప్రస్తుతం ప్రజా బలం లేదు. ఈ జనరేషన్ లీడర్లు కాదు.
విశాఖపట్నం ప్రాంతంపై జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారు. దీంతో అభ్యర్థుల విషయంలో టీడీపీ, జనసేన ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. చాలామంది నేతల్ని తమ పార్టీల్లోకి తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కొణతాల సేనలో చేరారు. ఆయన ఎంపీ టికెట్ ఆశించగా ఎమ్మెల్యే టికెట్ వచ్చేసింది. దీంతో జగన్ పార్టీ అభ్యర్థిని ఎదుర్కోవాలంటే చాలా కష్టమని అందుకే ప్రత్యర్థిని సైతం కలిశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ బలమేంటో చెప్పేందుకు ఒక ఉదాహరణ ఇది. ఆయన ముందు నిలబడి గెలవాలంటే దశాబ్దాల వైరాన్ని కూడా పక్కన పెట్టాల్సిందే.