సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు ఏమీ చేయలేదని ప్రతిపక్షాలు నిత్యం ఆరోపిస్తుంటాయి. కానీ అదంతా అబద్ధం. ఆయన తీసుకున్న చర్యలతో గడిచిన సుమారు ఐదు సంవత్సరాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేశారు. పేదరికాన్ని అధిగమించారు. సంక్షేమ పథకాలతో పలు కుటుంబాల్లోని మహిళలు సొంత వ్యాపారాలు చేసుకుంటూ తమ వంతుగా కుటుంబాలను పోషిస్తూ జీవన ముఖచిత్రాలను మార్చుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో రుణమాఫీ చేయకపోవడం, చిన్నపాటి వ్యాపారానికి ఆర్థిక తోడ్పాటు అందించకపోవడంతో మహిళల జీవనశైలిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. పొదుపు ద్వారా తీసుకున్న రుణం, దానికయ్యే వడ్డీ అదనం, వ్యాపార నిర్వహణ కోసం చేసిన అప్పులు.. ఉన్నత స్థితికి చేరుకోవాలనుకునే వారికి అడ్డంకులు ఉండేవి. ఇలాంటి పరిస్థితిల్లో వైఎస్ జగన్ తీసుకొచ్చిన పథకాలతోపాటు ఆర్థిక తోడ్పాటు అందించడంతో చిన్నపాటి వ్యాపారాలను ప్రారంభించుకుని తద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాలను సైతం పోషించే స్థాయికి ఎదిగారు. నాలుగేళ్లపాటు అందుకున్న సంక్షేమ పథకాలకు తోడు ప్రభుత్వం ఇస్తున్న రుణ సహాయంతో వ్యాపార ఖర్చులు, రుణాల చెల్లింపులు పోను ఆదాయం పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు నెలకు సగటున నెలకు రూ.10 వేలకు పైగా మిగులు ఆదాయంతో బ్యాంక్ల్లో పొదుపు చేసుకుంటున్నట్లు ఇటీవల బ్యాంకర్లు ప్రకటించిన లెక్కలే ఇందుకు నిదర్శనం. ఇదే పరిస్థితి మరి కొన్నేళ్లు ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం నామమాత్రంగా ఉంటుందని గ్రామీణ మహిళలు చెబుతున్నారు.
జగన్ మహిళల కోసం వైఎస్సార్ ఆసరా, అమ్మఒడి, చేయూత, పొదుపు మహిళలకు సున్నా వడ్డీ చెల్లింపులు తదితర సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. తన పదవీ కాలంలో మొత్తంగా రూ.2.55 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు.
ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా 45 నుంచి 60 ఏళ్ల వయసు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన మహిళల కోసం వైఎస్సార్ చేయూత పథకం అమలు చేస్తున్నారు. మహిళల సమగ్రాభివృద్ధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా 2020 ఆగస్టు 12వ తేదీన ప్రారంభించిన ఈ స్కీం కింద ఏడాదికి రూ.18,750 చొప్పున అందజేస్తున్నారు. నాలుగు దఫాల్లో రూ.75 వేల ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారు స్వశక్తిపై ఎదిగేందుకు, సుస్థిరమైన జీవనోపాధి పొందేందుకు అవకాశం కలుగుతుందని ఆలోచన. చేయూత పథకం కింద ఇప్పటి వరకూ మూడు విడతల్లో భారీగా నిధుల్ని మహిళలకు అకౌంట్లలో జమ చేశారు. బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించారు. దీంతో సదరు మహిళలు పాడి పరిశ్రమ, దుకాణాలు తదితరాలు పెట్టుకుని కుటుంబాలను పోషించుకున్నారు. ఇదొక విప్లవాత్మక పథకం.
చేయూత నాలుగో విడత నిధుల్ని త్వరలో విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు మూడేళ్లలో రూ.666.50 కోట్లను అందజేశారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉండే మహిళలు రూ.478.49 కోట్ల సాయం పొందగా.. పట్టణ ప్రాంతాల్లో వారికి రూ.188.01 కోట్లు ఇచ్చారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 1.50 లక్షల మంది మహిళలకు రూ.250 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.