మట్టిలోని మాణిక్యాలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర మెగాటోర్నీ ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ విశాఖపట్నంలో డాక్టర్ వైఎస్సార్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా ఫైనల్స్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు, నగదు పురస్కారాలు అందించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే..
గ్రామ, వార్డుస్ధాయి నుంచి రాష్ట్రంలోని ప్రతి ఇంట్లోనూ ఆరోగ్యం, వ్యాయామం, క్రీడల పట్ల అవగాహన పెంచడం చాలా అవసరం ఉంది.
గ్రామ స్థాయి నుంచి ఎవరూ ఎప్పుడూ ఊహించని పద్ధతిలో మట్టిలోని మాణిక్యాలను గుర్తించి, వారిని సానపట్టి, సరైన శిక్షణ ఇవ్వగలిగితే మనం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇంకా ఎక్కువగా మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలను పరిచయం చేయగలుగుతాం. ఇందులో భాగంగానే క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్మాడ్మింటన్ ఇటువంటి 5 రకాల క్రీడల్లో గత 47 రోజులుగా గ్రామ స్థాయి నుంచి ప్రోత్సహించే కార్యక్రమం చేస్తున్నాం. ఇందులో దాదాపుగా 25.40 లక్షల మంది క్రీడాకారులు గ్రామ స్థాయి నుంచి పాల్గొన్నారు. 3.30 లక్షల పోటీలు గ్రామ, వార్డు స్థాయిలో జరిగాయి. 1.24 లక్షల పోటీలు మండల స్థాయిలో, 7,346 పోటీలు నియోజకవర్గ స్థాయిలోనూ, 1731 పోటీలు జిల్లా స్థాయిలో జరిగితే… 260 మ్యాచ్లు రాష్ట్ర స్థాయిలో నిర్వహించాం. దాదాపు 37 కోట్ల కిట్లు గ్రామ స్థాయి నుంచి పోటీ పడుతున్న పిల్లలందరికీ ఇచ్చాం. రూ.12.21 కోట్ల బహుమతులు ఈరోజు పోటీలో పాలుపంచుకున్న మన పిల్లలందరికీ ఇవ్వడం జరుగుతోంది.
ఇంతగా ప్రోత్సహిస్తూ.. మట్టిలో మాణిక్యాలను కనుక్కునే ఈ కార్యక్రమంలో చెన్నై సూపర్ కింగ్స్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, వీరితోపాటు మిగతా ఆటలకు సంబంధించిన ప్రో కబడ్డీ, బ్లాక్ హాక్స్, వాలీబాల్, ఏపీ ఖోఖో అసోసియేషన్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారంతా పాల్గొంటూ ప్రతిభ కలిగిన 14 మందిని దత్తత తీసుకొని వాళ్లందరికీ మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి.
క్రికెట్ కబడ్డీ వాలీబాల్ ఖోఖో బ్యాడ్మింటన్ నుంచి మొత్తంగా 14 మంది ప్రతిభగల పిల్లలను గుర్తించాం. మట్టిలో మాణిక్యాలు వీళ్లు.. వీరికి ఇంకా సరైన ట్రైనింగ్ ఇవ్వగలిగితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడే పరిస్థితి ఉంటుందని మరింత ట్రైనింగ్ ఇచ్చేలా అడుగులు వేస్తున్నాం. ఈ 14 మందికి రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ఈరోజు జరిగినట్లే ప్రతీ ఏడాది ప్రతిభగల పిల్లల్ని గుర్తించి మరింత తర్ఫీదు ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేస్తాం. సచివాలయ పరిధి నుంచి క్రీడలను ప్రోత్సహిస్తూ, వ్యాయామానికి సంబంధించిన విలువను, ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను మరింతగా ముందుకు తీసుకెళ్తూ ప్రోత్సహించే కార్యక్రమంగా ఆడుదాం ఆంధ్ర నిలుస్తుంది. ఇలాంటి టోర్నీల వల్ల మరింత ప్రోత్సాహం ఆటలకు జరగాలి. మన పిల్లలకు మరింత మంచి జరగాలని మనసారా కోరుకుంటూ పిల్లలకు బహుమతులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ధన్యవాదాలు అని సీఎం జగన్ తన ప్రసంగం ముగించారు.