16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) జయంతి సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి సీఎం శ్రీ వైఎస్ జగన్ నివాళులర్పించారు. ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులను జారీ చేసింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్లు వరుదు కళ్యాణి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఏపీ శాలివాహన కార్పొరేషన్ ఛైర్మన్ మండేపూడి పురుషోత్తం పాల్గొని నివాళులర్పించారు.
రామాయణ కావ్యాలు సంక్లిష్టమైన పదాలతో రాయబడేవి. కానీ మొదటిసారిగా సామాన్యులకు కూడా అర్ధమయ్యేలా వాడుక భాషకు దగ్గరగా అత్యంత సరళమైన భాషలో కవయిత్రి మొల్ల రామాయణం రాసి ప్రజలకు చేరువచేసింది. కాగా మొల్ల స్వస్థలం కడప జిల్లా, గోపవరం గ్రామం. మొల్ల రామాయణంలో ఆరు కాండాలు ఉంటాయి. మొత్తం 871 పద్యాలున్న ఈ కావ్యాన్ని మొల్ల కేవలం ఐదు రోజులలో రాసిందని చరిత్రకారులు వెల్లడిస్తారు.
మొల్ల రామాయణంలో కందపద్యాలు ఎక్కువగా ఉండడం వల్ల, కంద రామాయణం అని కూడా ఉంటారు. ఈమె శ్రీ కృష్ణ దేవరాయల కాలానికి చెందిందని చరిత్రకారులు భావిస్తారు. కవయిత్రి మొల్ల జీవిత ఆధారంగా 1970లో హాస్య నటుడు పద్మనాభం వాణిశ్రీ ప్రధాన పాత్రలో కథానాయిక మొల్ల అనే సినిమా రూపొందించారు.