ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో పొత్తు చర్చల్లో టీడీపీ అధినేత చంద్రబాబు తలమునకలుగా ఉన్నారు. పొత్తు లెక్కలు, సీట్ల సర్దుబాట్లు, గెలిస్తే ఎన్ని శాఖలు అప్పజెప్పాలో ఆ లెక్కలు ఇలా అన్నిటిలో బీజేపీకి లొంగిపోయారు బాబు. అయినప్పటికీ.. విరామ సమయంలో ఇటు పార్టీ నేతలపైనా దృష్టి సారించారు.
సారించకపోతే తప్పదు మరి, ఇంకా విడుదల చేయాల్సిన అభ్యర్థుల లిస్టులో ఎన్ని బీజేపీ కి ఇస్తారో అన్నదే కాక, ఆల్రడీ ప్రకటించిన వాటిలో కూడా టీడీపీ భారీగా కోత పెట్టుకుని జుట్టు బీజేపికి అందించాల్సిన పరిస్థితికి వచ్చింది. దాంతో, ముఖ్యంగా సీట్లు కోల్పోతున్న నాయకులకు బాబు ఢిల్లీ నుంచే ఫోన్లు చేసి బుజ్జగిస్తున్నారు.
కొన్ని నియోజకవర్గాల్లో జనసేన బీజేపీ తో పొత్తు ఉండటం వల్ల సీటు అభ్యర్థుల విషయంలో పోటీ వాతావరణం ఉండడం వలన, అక్కడ స్థానిక నేతలకు ఫోన్లు చేసి, పార్టీ అధికారికంగా టికెట్ ఇచ్చినవారికి సహకరించాలని కోరారు. అలాగే జనసేనతో పొత్తులో అవకాశం కోల్పో యిన నియోజకవర్గ నేతలను కూడా ఆయన సముదాయించారు.
పార్టీ నిర్ణయాన్ని గౌరవించి మిత్రపక్షం కోసం పనిచే యాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం 19 నియోజకవర్గాల నేతలతో ఆయన మాట్లాడినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. వీరిలో జనసేనకు కేటాయించిన 11స్థానాల నేతలు ఉన్నారు. ఉంగుటూరు, పిఠాపురం, పోలవరం (ఎస్టీ), నరసాపురం, తాడేపల్లిగూడెం, విశాఖ దక్షిణ, పాలకొండ (ఎస్సీ), అనంత పురం, తిరుపతి ఇన్చార్టులు గన్ని వీరాంజనేయులు, వర్మ, బొరగం శ్రీనివాస్, పొత్తూరి రామరాజు, వలవల బాబీ, గండి బాబ్లీ, నిమ్మక జయకృష్ణ, వైకుంఠం ప్రభాకర్ చౌదరి, సుగుణమ్మ.. కాకినాడ రూరల్ సీనియర్ నేత పిల్లి సత్యనారాయణ మూర్తి, యలమంచిలి సీనియర్ నేతలు పప్పల చలపతి రావు, ప్రగడ నాగేశ్వరరావు తదితరులతో చంద్రబాబు మాట్లాడారు. ఈ నియోజకవర్గాలను పొత్తులో భాగంగా జన సేనకు ఇవ్వాల్సి వచ్చిందని, పరిస్థితిని అర్ధం చేసుకుని పార్టీకి, మన గెలుపుకు సహకరించాలని కోరారు.
ఎప్పటిలానే, టికెట్టు కోల్పోయిన వారందరికీ అధికారంలోకి వస్తే (?) వారికి తగ్గ అవకాశాలు కల్పిస్తామని, పార్టీ శ్రేణులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. మొదటి దఫా అభ్యర్థుల పేర్ల విడుదలకే టీడీపీలో ముసలం బయలుదేరి, జనసేన టీడీపీ పొత్తుల మధ్య వివాదాలు భగ్గుమన్నాయి. ఇప్పుడు బీజేపీతో కూడా చర్చలు జరుపుతూ ఉండటంతో, రాబోయే లిస్టు విడుదల తర్వాత ఖచ్చితంగా తెలుగు తమ్ముళ్ళు నిరసిస్తారని తెలిసిన బాబు ఢిల్లీ నుంచే బుజ్జగింపుల పర్వం మొదలుపెట్టారు.