ఈ మధ్య తెలుగుదేశం అధినేత చంద్రబాబు కలలో కూడా ఢిల్లీని తలుచుకుంటున్నారంట. అందుకే కాబోలు గురువారం •హైదరాబాద్లోని బేగంపేట్ ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హస్తినపై దిగులు పెట్టుకుని ఆ ఊరి బాట పట్టారు. ఈ టూరు సొంత ప్రయోజనాల కోసమే అయినా బయటికి చెప్పేది వేరు. టీడీపీని ఎన్డీఏలో చేర్చేందుకు జరుగుతున్న ప్రయత్నంలో భాగంగా ఇద్దరూ కమలం పెద్దల్ని కలిసి బతిమిలాడుకునేందుకు వెళ్లారు.
కాగా నిన్న అర్ధరాత్రి బీజేపీ హైకమాండ్తో అభ్యర్థుల ఎంపికపై ఏపీ నాయకులు చర్చలు జరిపారు. 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లకు అభ్యర్థులను తయారు చేసే విషయమై మాట్లాడారు. ఇందులో పొత్తులపై ఎలాంటి చర్చ జరగలేదని అధ్యక్షురాలు దుగ్గబాటి పురందేశ్వరి స్వయానా ప్రకటించారు. కానీ ఆమె మనసులో మాత్రం టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనే ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే బాబు, సేనాని ఢిల్లీ టూర్ చేపట్టారని తెలుస్తోంది. కమలం పార్టీకి మొత్తం ఐదు పార్లమెంట్, 11 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు రెడీ అంటూ ఇప్పటికే తెలుగుదేశం, ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్నాయి. కానీ• అరకొర సీట్లతో పొత్తుల వల్ల బీజేపీకి ఒరిగేదేమీ లేదని నేతలు భావిస్తున్నారు. ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. కానీ ఆ పార్టీలోని బాబు మనుషులు ఎన్డీఏలోకి టీడీపీని తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు.
బాబు, పవన్ కళ్యాణ్ తాజా ఢిల్లీ పర్యటనతో పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కుదిరితే ఈరోజే లేకపోతే రేపో, ఎల్లుండో అభ్యర్థులను ఖరారు చేయొచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తేలే వరకూ ఢిల్లీలోనే ఉండాలని బాబు నిర్ణయించుకున్నారని సమాచారం. మరి పొత్తు పొడుస్తుందో.. వికటిస్తుందో చూడాలి.