ప్రజల ఇంటి ముంగిటకు సంక్షేమ పథకాలను చేర్చేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2.60 లక్షల మందితో కూడిన వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు. ప్రతి 50 కుటుంబాలకు ఒకరు ఉంటారు. 2019 ఆగస్ట్ 15వ తేదీన ఈ వ్యవస్థను ప్రారంభించారు. వీరి సేవలకు ప్రజానీకం సలాం కొడుతుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం అక్కసు వెళ్లగక్కారు. ప్రతి సభలో వారిని తిట్టారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా స్క్రిప్ట్ ప్రకారం వారిని సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
గత సంవత్సరం జూలై 9వ తేదీన ఏలూరులో వారాహి యాత్ర జరిగింది. ఇందులో పవన్ కళ్యాణ్ వలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత వివరాలు సేకరిస్తోంది. రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు కనిపించకుండాపోయారు. కేంద్ర నిఘా వర్గాల నుంచి నాకు సమాచారం అందింది. ముఖ్యంగా ఒంటరి మహిళల వివరాలు సేకరించి సంఘ విద్రోహ శక్తుల ద్వారా వల వేసి అపహరిస్తున్నారు. దీనినంతటికి కారణం వలంటీర్లేనని ఆయన ఆరోపించారు. ఈ విషయం అన్ని ప్రసాద మాధ్యమాల్లో వచ్చింది. మహిళా వలంటీర్లు పవన్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. జనసేనాని ఫ్లెక్సీలు దగ్ధం చేశారు. అయితే ఆయన కొద్దిరోజులు వెనక్కి తగ్గలేదు. సేవా సైన్యంపై మాటల దాడిని పెంచారు. ఈ వ్యవస్థతో చేటు తప్పదని, వాళ్లు లేకుంటే దేశమేమీ ఆగిపోదని ఘాటుగా అన్నారు. దీని నడుం విరగ్గొట్టాలన్నారు. వలంటీర్లు తప్పుడు పనులు చేస్తున్నారని చెబుతూ వచ్చారు. దీనికి టీడీపీ, ఎల్లో మీడియా వంత పాడాయి. ఈ నేపథ్యంలో వలంటీర్ల నుంచి నిరసన అధికమైంది. వారు ఆగ్రహంతో రగిలిపోవడంతో భయపడిన పవన్ ఒకానొక సందర్భంలో నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
వలంటీర్ల విషయంలో పవన్, ఎల్లో గ్యాంగ్ చేస్తున్న దుష్ప్రచారాన్ని అటు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇటు వైఎస్సార్సీపీ నేతలు ఖండిస్తూ వచ్చారు. వారు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంటే మహిళల వివరాలు సేకరిస్తున్నారంటూ నీచంగా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. కానీ ఇప్పటికీ పచ్చ మనుషులు ఆ వ్యవస్థపై విషం కక్కుతూనే ఉన్నారు. మరో వైపు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ బాటలో నడుస్తూ సుమారు 80 వేల మంది వలంటీర్లను నియమించేందుకు చర్యలు తీసుకుంటోంది. పలు రాష్ట్రాలకు చెందిన అధికారులు ఈ వ్యవస్థపై అధ్యయనం చేశారు. తమ ప్రాంతాల్లో ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తున్నారు.
పవన్పై కేసు
ఏలూరులో వలంటీర్లపై పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. చర్యల నిమిత్తం గత ఏడాది జూలై 20న ఉత్తర్వులు ఇచ్చింది. గుంటూరు న్యాయస్థానంలో క్రిమినల్ కేసు పెట్టింది. వలంటీర్లు మనోధైర్యం కోల్పోయేలా ఆయన మాట్లాడరని, చర్యలు తీసుకోవాలని కోరింది. పలువురి వాగ్మూలం మేరకు కేసు దాఖలు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆనాడు వెల్లడించారు. విచారణకు స్వీకరించిన జిల్లా ప్రధాన న్యాయస్థానం 499, 500, ఐపీసీ సెక్షన్ల కింద పవన్పై క్రిమినల్ కేసు నమోదు చేసి నాలుగో అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. సేనాని మార్చి 25వ తేదీన విచారణకు రావాలని తాజాగా నాలుగో అదనపు జిల్లా జడ్జి శరత్బాబు నోటీసులిచ్చారు. దీంతో తన నోటి దురుసు కారణంగా పవన్ న్యాయ విచారణకు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చంద్రబాబు కూడా చాలాకాలం వలంటీర్లను తిట్టారు. అయితే ఇటీవల ఎన్నికల సభల్లో వారిపై ప్రేమ ఉన్నట్లు నటించారు. తనకు ఎవరిపై కోపం లేదని, జగన్కు అనుకూలంగా ఉంటేనే సహించనని ప్లేట్ తిప్పారు. నాడు ఈ వ్యవస్థపై పవన్ను ఉసిగొల్పిన బాబు నేడు ఓట్ల కోసం వారిని మచ్చిక చేసుకోవాలని చూశారు. పైగా అధికారంలోకి వస్తే 30 ఇళ్లకే ఒకరిని నియమిస్తామని ఆర్భాటంగా ప్రకటించారు.
పవన్ దృష్టిలో పేదలకు మంచి చేయడమే వలంటీర్లు చేసిన నేరం. అందుకే వారి వల్ల మహిళలు అదృశ్యమయ్యారంటూ అభాండం వేశారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసమే కుటుంబాల వివరాలు సేకరించింది. ఆ డేటాను చాలా భద్రంగా ఉంచుతుంది. ఇంకా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల డేటాను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి ఎన్నికల కోసం వాడుకుంది. ప్రస్తుతం జనం ఇళ్లకు వెళ్లి బాబు మీకు పథకాలు ఇస్తారని పూర్తి వివరాలు తీసుకుంటోంది. మాజీ మంత్రి నారాయణ అయితే తన విద్యాసంస్థల సిబ్బంది ద్వారా సున్నిత సమాచారాన్ని సేకరిస్తున్నారు. వీటిపై కేంద్ర నిఘా వర్గాల సమాచారం పవన్కు అందలేదేమో.. ఎప్పుడూ మాట్లాడలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని తిట్టానుకున్న ప్రతిసారీ ఆయన నిఘా వర్గాల సమాచారం, కేంద్ర పెద్దలు చెప్పారనే పదాలు వాడుతుంటారు. మొత్తానికి ఎల్లో స్క్రిప్ట్ అప్పజెప్పిన పవన్ న్యాయస్థానం బోను ఎక్కాల్సి వస్తోంది. వారిని గుడ్డిగా నమ్మితే అంతే.. అనకూడని మాటలు అన్న నిన్ను సేవా సైన్యాన్ని ఎప్పటికీ క్షమించదు.