ఏపీలో రాబోయే ఎన్నికలకి సర్వం సిద్దం చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) ముఖేష్ కుమార్ మీనా మీడియాకు తెలిపారు. మార్చి 16 నాటికి ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఓటర్ల సంఖ్య 4.09 కోట్లు గా ఉన్నరని, జనవరి 22న నమోదైన 4.07 కోట్లతో పోలిస్తే ఇది పెరిగిందని, మొత్తం ఓటర్లలో రెండు కోట్ల మంది పురుషులు, 2.08 కోట్ల మంది మహిళలు, 3,346 మంది థర్డ్ జెండర్ ఉన్నారని నిన్నటి రోజునే ఆయన విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
మే 13న ఆంధ్రప్రదేశ్లో శాసనసభ, సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన డేటాను కమిషన్కు పంపుతామని చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 46,165 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని మీనా తెలిపారు. మహిళా నిర్వహణలో 179 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించినట్లు సీఈవో తెలిపారు. రాష్ట్రంలోని 25 లోక్సభ నియోజకవర్గాల్లో నాలుగు (ఎస్సీ) ఒకటి (ఎస్టీ) రిజర్వ్ చేయబడిందని మీనా చెప్పారు అలాగే 29 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్సీలకు, 7 ఎస్టీలకు రిజర్వ్ చేశామన్నారు. ఎన్నికల ఫొటో గుర్తింపు కార్డులు మార్చి నెలాఖరులోగా పంపిణీ చేస్తామని, ఓటరు సమాచార స్లిప్పులను ఎన్నికలకు ఐదు రోజుల ముందు పంపిణీ చేస్తామని తెలిపారు.
దృష్టి లోపం ఉన్న ఓటర్ల కోసం బ్రెయిలీ లిపిలో ఓటరు సమాచార స్లిప్లను కూడా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఒక పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1500 మంది ఓటర్లు ఉంటారని తెలిపారు. సీనియర్ సిటిజన్లు అలాగే ప్రత్యేక సామర్థ్యం గల ఓటర్లు తమ ఓటు హక్కును సౌకర్యవంతంగా వినియోగించుకునేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఎన్నికల భద్రత కోసం స్థానిక పోలీసు బలగాలకు అనుబంధంగా ఆంధ్రప్రదేశ్కు 100 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను (సీఏపీఎఫ్) కేటాయించామని తెలిపారు.