ఆంధ్రప్రదేశ్ బిజెపి లో టికెట్లు పంచాయతీ ఎప్పటికి తెగుతుందో అర్థం కాని పరిస్థితి. బిజెపి టిడిపి జనసేన పొత్తు ఖరారు అయ్యి పది రోజులు కావస్తున్న బిజెపి పోటీ చేసే సీట్లు ఒక కొలిక్కి రాలేదు. పొత్తులో భాగంగా బిజెపి పది అసెంబ్లీ, ఆరు పార్లమెంట్ స్థానాలలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. స్థానాలు కేటాయింపు వరకు బానే ఉన్నా అసలు సమస్య ఏ స్థానాల్లో పోటీ చేయాలి, ఎవరు పోటీ చేయాలి, ఎక్కడ పోటీ చేయాలి అనే సమస్య బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారిపోయింది.
చంద్రబాబు టిడిపి గెలవని సీట్లు బిజెపికి కేటాయించారని అధిష్టానానికి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ బిజెపి సీనియర్లు లేఖ రాశారు. బిజెపి ప్రతిపాదించిన సీట్లు కాకుండా టిడిపి గెలవలేని సీట్లనే బిజెపి కేటాయించారంటూ లేఖలో వివరించారు. బిజెపి అడిగిన స్థానాలలో చోడవరం, మాడుగుల, రాజమండ్రి సిటీ, పి.గన్నవరం, విజయవాడ సెంట్రల్, కదిరి, మదనపల్లి, శ్రీకాళహస్తి ఇలా 8 స్థానాలలో ఇప్పటికే చంద్రబాబు నాయుడు తన అతి తెలివిని ఉపయోగించి సీట్లని ప్రకటించేశాడు. చోడవరం లేదా మాడుగుల స్థానాన్ని అడిగిన బిజెపి ఆ రెండు స్థానాల్లోనూ చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించేసి పాడేరు తీసుకోమని సలహా ఇస్తున్నాడు.
రాజమండ్రి స్థానాన్ని బిజెపి ఆశిస్తే ఆ స్థానంలో కూడా టిడిపి అభ్యర్థిని ప్రకటించేసి, అనపర్తి సీటు తీసుకోమని కోరుతున్నాడు. అనపర్తి నియోజకవర్గంలో కనీసం బిజెపికి సంబంధించిన నాయకుడు గాని క్యాడర్ లేదు అలాంటి చోట ఎలా పోటీ చేస్తామంటూ రాజమండ్రి బిజెపి నేతలు మండిపడుతున్నారు. బిజెపి కోరుకున్నటువంటి గుంటూరు వెస్ట్, శ్రీకాళహస్తి,మదనపల్లి, కదిరి సీట్లలో అభ్యర్థులని టిడిపి ప్రకటించిన తర్వాత కూడా, ఏపీ బీజేపీ నేతలు ఇప్పుడు అవే సీట్లు కావాలంటూ కేంద్ర నాయకుల పైన ఒత్తిడి తెస్తున్నారు.ఒకవైపు తమ శక్తివంచన ఆంధ్రప్రదేశ్ లో బిజెపిని కాపాడిన నాయకుల పరిస్థితి ఏమో సీట్ల విషయంలో మొరపెట్టుకుంటుంటే, మరోపక్క చంద్రబాబు బీ టీమ్ లాబీయింగ్ కి దిగారు. ధర్మవరం నుంచి వరదాపురం సూరి, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, ఏలూరు నుంచి సుజనా చౌదరి, నర్సాపురం నుంచి రఘురాం కృష్ణంరాజు ఇప్పటికన్నుంచి పోటీ చేస్తామని ప్రకటించేసుకున్నారు. బిజెపి పార్టీ కోసం కష్టపడిన నాయకులకి స్థానం లేదా అంటూ బిజెపి నేతలు వాపోతున్నారు. సీట్ల విషయంలో బిజెపి కేంద్ర నాయకత్వం చంద్రబాబు ఇచ్చిన స్థానాలకు ఓకే అంటుందా లేక తాము పోటీ చేయాలనుకునే స్థానాలను బిజెపి తీసుకుంటుందా రానున్న రోజుల్లో చూడాలి.