‘రాష్ట్రంలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ బలమైన శక్తిగా ఎదిగింది. మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు తమవంతు కృషి చేయాలి’ ఈ మాటలు చెప్పిన వ్యక్తి ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. స్థలం నెల్లూరు నగరం. రాష్ట్రంలో కమలం పార్టీ స్థితి గురించి తెలిసిన వారికి ఆమె వ్యాఖ్యలు నవ్వు తెప్పిస్తున్నాయి. అసలు బీజేపీ ఎదుగుదలను అడ్డుకుంటున్న వారిలో పురందేశ్వరి కూడా ఒకరు కదా..
బీజేపీ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి అమిత్షాల నేతృత్వంలో బలమైన శక్తిగా అవతరించింది. ఇప్పటికి 12 రాష్ట్రాల్లో ఆ పార్టీ సొంతంగా అధికారంలో ఉంది. కొన్నిచోట్ల పొత్తులతో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. 2019లో ఒక్క ఆ పార్టీనే 303 పార్లమెంట్ సీట్లను గెలుచుకుంది. మోదీ, షా తిరుగులేని నేతలుగా ఎదిగారు. కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి వేరు. తెలుగుదేశం కమలం పార్టీని ఎదుగుదలను అడుగడుగునా అడ్డుకుంటోంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇదే జరిగింది. చంద్రబాబు నాయుడు బీజేపీని వాడుకుని అధికారంలోకి వచ్చిన సందర్భాలున్నాయి. ఎప్పటికప్పుడు తన మనుషులే ఇక్కడ కమలం అధ్యక్షులుగా ఉండేలా ఆయన చక్రం తిప్పుతుంటారు.
చాలా రాష్ట్రాల్లో ఒంటరిగా ఎదిగిన కాషాయ పార్టీ ఆంధ్రాలో మాత్రం మొదటి నుంచి ప్రభావం చూపలేకపోతోంది. టీడీపీ మూలాలున్న వారు ఆ బీజేపీని నారా వారికి ఉపయోగపడేలా తీర్చిదిద్దారు. దీంతో మోదీ, షాకు అసంతృప్తి ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ చీఫ్గా పనిచేసిన నెల్లూరు జిల్లా వాసి వెంకయ్య నాయుడికి టీడీపీతో మంచి సంబంధాలున్నాయి. ఆయన వల్లే కాషాయ పార్టీ ఈ దుస్థితిలో ఉందని ఆరోపణలున్నాయి. సామాజికవర్గం కోణంలో సొంతంగా నిర్ణయాలు తీసుకున్నట్లు చెబుతుంటారు. నేతలు వ్యతిరేకిస్తున్నా సరే టీడీపీతో పలుమార్లు పొత్తు కుదిర్చారు. 2014లోనూ ఇదే జరిగింది. అప్పుడు మోదీ హవాలో గెలిచిన బాబు కమలం పార్టీకి మంత్రి పదవులు ఇచ్చారు. అయితే తర్వాతి కాలంలో కాంగ్రెస్తో జతకట్టి ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చారు. మళ్లీ ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతున్నారు. కాగా గతంలో కన్నా లక్ష్మీనారాయణ ఏపీ అధ్యక్షుడైనా టీడీపీకి అనుకూలంగానే వ్యవహరించారు. ఇప్పుడు ఏకంగా ఆ పార్టీలో చేరి అసెంబ్లీ సీటు తీసుకుంటున్నారు. బాబు వ్యూహాలు ఇలాగే ఉంటాయి.
2019లో దారుణంగా ఓడిపోగానే చంద్రబాబు తన మనుషులైన సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ను బీజేపీలోకి పంపారు. వారు పార్టీ మారినా పనిచేసేది మాత్రం పాత బాస్ కోసమే. ఆయన ప్రయోజనాలే అత్యంత ముఖ్యం. ఇక భువనేశ్వరి సోదరి అయిన పురందేశ్వరి ప్రస్తుతం బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. తమ పార్టీ చాలా బలంగా ఉందని ఆమె వ్యాఖ్యనించడం హాస్యాస్పదంగా ఉంది. బాబు అండ్ కో పార్టీని ఏ విధంగా తొక్కేశారో, ఎదగకుండా ఏం చేశారో ఆమెకు తెలియంది కాదు. దేశమంతా మోదీ ప్రభంజనం ఉన్నా ఇక్కడ మాత్రం చంద్రబాబు చెప్పినట్లు కమలం నేతలు ఆడాల్సిందే. అందుకే వారంతా 24లో టీడీపీతో పొత్తుకు ఒప్పుకోవాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు.
తెలంగాణలో బీజేపీ కొంతమేర బలపడిందని చెప్పొచ్చు. గతంలో ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గణనీయమైన సీట్లు సాధించారు. 23 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయినా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు నేతలు కష్టపడుతున్నారు. కానీ ఏపీ విషయంలోనే పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. టీడీపీతో పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్తే డిపాజిట్లు కూడా రావని కమలం పార్టీలోని బాబు అనుయాయులు అధిష్టానానికి నివేదిక ఇచ్చారు. సీనియర్ నేతలు పొత్తు వద్దంటున్నా వినడంలేదు. వాస్తవానికి బీజేపీ అధిష్టానం ఏదైనా రాష్ట్రంలో బలమైన శక్తిగా మారేందుకు చాలా గ్రౌండ్ వర్క్ చేస్తుంది. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్లో అధికార తృణముల్ కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చి కమ్యూనిస్ట్ పార్టీని వెనక్కి నెట్టి రెండో స్థానంలోకి వచ్చిందంటే వారు ఏ స్థాయిలో వ్యూహాలు పన్నుతారో అర్థం చేసుకోవచ్చు. దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో పలుమార్లు అధికారంలోకి వచ్చారు. అయితే ఏపీ విషయంలో ఒత్తిళ్లకు తలొగ్గి స్థానిక నాయకులకు పెత్తనం ఇచ్చారు. వారేమో బాబుకు అమ్ముడుపోయి ఆయనకు లబ్ధి చేకూర్చేందుకు పనిచేస్తున్నారు. చరిత్ర ఒకలా ఉంటే పురందేశ్వరి ఏపీలో తమ పార్టీ చాలా బలంగా ఉందని చెప్పడాన్ని చూసి మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలు ఆశ్చర్యపోతున్నారు. చేయాల్సిందంతా చేసి కబుర్లు చెబుతున్నారని వారి భావన. బలమైన శక్తిగా ఎదిగి ఉంటే టీడీపీతో పొత్తు ఎందుకు చిన్నమ్మా.. ఒంటరిగా పోటీ చేయొచ్చుగా.. బాబు సీఎంను చేసేందుకు మీరు ఆడుతున్న నాటకాలకు హ్యాట్సాఫ్