‘నేను వచ్చే ఎన్డీఏ కేబినెట్లో కేంద్ర మంత్రి.. కుదరకపోతే సహాయ మంత్రి అవుతున్నా.. నా వర్గంగా ఉండండి. మీకు కావాల్సినంత డబ్బు ఇస్తా. ఎంత పెద్ద పనైనా చేసి పెడతా’ అంటూ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి (వీపీఆర్) వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులను ప్రలోభాలకు గురి చేస్తున్నారు.
భార్య ప్రశాంతిరెడ్డికి వైఎస్సార్సీపీ నెల్లూరు సిటీ టికెట్ ఇవ్వదని నిర్ధారణ అయ్యాక వీపీఆర్ అలకబూనారు. ఇదే సమయంలో ఆయన్ను తమవైపు తిప్పుకొనేందుకు కేంద్ర మంత్రి పదవి ఇప్పిస్తామని ఒకనాటి బీజేపీ పెద్ద, చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు, నెల్లూరు జిల్లా వాసి అయిన వెంకయ్య నాయుడు, ఇంకా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆశ పెట్టారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన టీడీపీలో చేరి నెల్లూరు ఎంపీగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రెండు రోజులుగా వీపీఆర్ను తెలుగుదేశం సీనియర్లు, టికెట్లు ఆశిస్తున్న వారు, నేతలు, కార్యకర్తలు కలిసి ప్రసన్నం చేసుకుంటున్నారు. వెంటనే పార్టీలో చేరండని కోరుతున్నారు. మాజీ మంత్రి పొంగూరు నారాయణను వ్యతిరేకిస్తున్న వర్గమైతే నగరంలో గురువారం వీపీఆర్కు మద్దతుగా ర్యాలీ చేసింది. కానీ ఆయనకు సంతృప్తి కలగడం లేదు. తెలుగుదేశంలో తనకంటూ బలమైన వర్గం ఉండాలని భావిస్తున్న వేమిరెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ ముఖ్య నేతలెవరూ మద్దతు ప్రకటించలేదు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్ల వీపీఆర్ వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కొత్త నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగానూ పనిచేశారు. ప్రజాప్రతినిధులందూ చాలా గౌరవించారు. తమ నియోజకవర్గాల్లో కార్యక్రమాలకు పిలిచి పెద్దపీట వేశారు. వైఎస్సార్సీపీ ముఖ్య నేతలంతా బాగా చూసుకున్నారు కాబట్టి పార్టీ మారగానే తన వెంట నడిచేస్తారు.. చంద్రబాబు వద్ద బలం చూపించుకోవచ్చని వేమిరెడ్డి ఆశ పడ్డారు. అయితే అలా జరగలేదు. ఆయనకు జనంలో పూర్తిగా బలం లేదు. ఇంతకాలం జగన్, పార్టీ వల్లే గౌరవ మర్యాదలు దక్కాయి. నేడు బయటకు వెళ్లాక వాస్తవ పరిస్థితులు అర్థమవుతున్నాయి.
టీడీపీ నేతలు డబ్బు కోసమే చుట్టూ తిరుగుతారని మాజీ మంత్రి నారాయణలాగే వీపీఆర్ కూడా ఆలోచిస్తున్నారు. దీంతో చాలా ఏళ్లు కలిసి పనిచేసిన వైఎస్సార్సీపీ నేతలు తన వెంట నడిచి వర్గంగా ఉంటే ధైర్యంగా ఉంటుందని అనుకుంటున్నారు. బాబు వద్ద మార్కులు కొట్టేయొచ్చు. కానీ ఒకరిద్దరు చోటా నేతలు మాత్రమే వెళ్లి కలవడంతో షాక్కు గురయ్యారు. బాబు అండ్ కో కూడా వేమిరెడ్డి రాకతో నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ ఖాళీ అయిపోతుందని సంబర పడ్డారు. కానీ ఒక్క ఎమ్మెల్యే నుంచి కూడా స్పందన కూడా లేదు. దీంతో వేమిరెడ్డి తన మనుషుల ద్వారా ప్రలోభాలకు తెరలేపారు. కార్పొరేటర్లు, సర్పంచ్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్ల డైరెక్టర్లు, ముఖ్య నేతలను తమ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బాబు గెలవకపోయినా ఇబ్బంది లేదని, ఎన్డీఏతో పొత్తు ఉంటుంది కాబట్టి.. వెంకయ్య నాయుడి ఆశీస్సులతో వీపీఆర్ కేంద్ర మంత్రి కావడం ఖాయమని, ఆయనకు మద్దతు ఇవ్వాలని బతిమిలాడుకుంటున్నారు. టీడీపీ నేతలంతా డబ్బు కోసమే ఆయన్ను కలుస్తున్నారని, మీరైతే నమ్మకంగా ఉంటారని చెబుతున్నారు. నగదు ఇస్తామని, మంత్రి అయ్యాక పనులు చేసిపెడతామని హామీలు గుప్పిస్తున్నారు. ఒకరిద్దరు చోటా నేతలు సరే అన్నారు. మిగిలిన వారు జిల్లాలో వైఎస్సార్సీపీకి పెద్దన్న బాధ్యతలు ఇస్తే.. పదవి కోసం వెళ్లిపోవడం కరెక్టేనా అంటూ ఎదురు ప్రశ్నిస్తుండటంతో వీపీఆర్ మనుషులు మౌనంగా వెనక్కి వెళ్లిపోతున్నారు. టీడీపీ నాయకులను వర్గంగా మార్చుకోవడం ప్రభాకర్రెడ్డి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. సోమిరెడ్డి సమీప బంధువే అయినా స్వార్థం ఎక్కువగా ఉన్న మనిషి. తనకంటూ బలమైన వర్గం లేకపోతే సీనియర్ తెలుగుదేశం నేతలు లెక్క చేయరని వీపీఆర్ కొద్దిరోజులకే డిసైడ్ అయిపోయారు. ఇప్పటికే నారాయణ తీవ్రంగా వ్యతిరికేస్తున్నారు. తాను కలిసినా మనుషులు ఎవరూ వెళ్లకుండా ఆయన జాగ్రత్త పడ్డారు. పచ్చ కండువా కప్పుకోక ముందే వీపీఆర్కు చుక్కలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా వీపీఆర్కు జిల్లాలోని ముస్లిం వర్గం నుంచి తీవ్ర నిరసన ఎదురవుతోంది. జగన్ సిటీ సమన్వయకర్తగా సామాన్యుడైన ఖలీల్ అహ్మద్ను ప్రకటించగానే వేమిరెడ్డి అయిష్టత చూపారు. అతడికి టికెట్ ఇవ్వడం తనకు నచ్చలేదని చెప్పారు. దీంతో ముస్లిం సమాజం ప్రెస్మీట్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జగన్ పెద్ద మనసుతో తమకు అవకాశం ఇస్తే.. వీపీఆర్ చిన్నచూపు చూస్తున్నారని అంటున్నారు. మొన్నటి వరకు జిల్లా పెద్దాయన హోదా అనుభవించిన వ్యక్తి నేడు టీడీపీ గుంపులో ఒకడిగా మిగిలిపోనున్నాడు.