సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండో అల్లుడు భరత్ అసెంబ్లీ బరిలో నిలిచే విషయంలో అధిష్టానంపైనే కాలు దువ్వుతున్నాడు. విశాఖ ఉత్తరం నుంచి తానే పోటీ చేస్తానని ప్రకటించారు. భారతీయ జనతా పార్టీతో పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని వారికి కేటాయించారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో భరత్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
భరత్ గత ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం టీడీపీ విశాఖ పార్లమెంట్ సమన్వయకర్తగా ఉన్నారు. ఉత్తరం సీటు నుంచి బరిలో నిలవాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. మామ బాలకృష్ణ అండదండలు ఉండడంతో టికెట్ తనకేనని భావించారు. అయితే టీడీపీకి, కమలం పార్టీకి పొత్తు కుదరడంతో కొత్త సమస్యలు వచ్చాయి. దీంతో తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో సోమవారం ఉత్తర నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఇందులో నేతలు మాట్లాడుతూ పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి ఇస్తే.. అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినా సహకరించేది లేదని స్పష్టం చేశారు. దీనికి భరత్ స్పందిస్తూ ఈసారి తాను ఉత్తరం టికెట్ తీసుకుని పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ బీజేపీ నాయకుడు విష్ణుకుమార్రాజు పార్టీ కార్యాలయం ప్రారంభించి తిరుగుతున్నారని, మీరు పోటీ చేస్తామంటే ఎలా నమ్మాలని పలువురు కార్యకర్తలు ప్రశ్నించారు. కానీ భరత్ మాత్రం తానే పోటీ చేస్తానని కుండబద్ధలు కొట్టారు.
చంద్రబాబుకు బీజేపీతో పొత్తు చాలా అవసరం. ఈ నేపథ్యంలో వారి మాట కాదని ముందుకు వెళ్లలేడు. దీంతో బాలకృష్ణ చిన్నల్లుడు ఎంత అడ్డం తిరిగినా ఉపయోగం ఉండదనే వాదన ఉంది. లోకేశ్ ఇప్పిస్తాడులే అనుకుంటే పొరపాటే అవుతుంది. బాబు ఎవరి మాట వినరు. భరత్ కొత్త సమస్యలు సృష్టిస్తాడా.. లేక సర్దుకుపోతాడా.