ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) రాష్ట్రంలోని యువత ఉద్యోగ అవకాశాలు పొందేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గత నాలుగున్నర సంవత్సరాలకు పైగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. విదేశాల్లో జాబ్ చేయాలనేది పేద, మధ్యతరగతి యువత కల. అయితే ఆర్థిక పరిస్థితులు, ఇతర సమస్యల కారణంగా ధైర్యం ముందుకు వెళ్లలేరు. అలాంటి వారు విదేశాల్లో ఉపాధి పొందేలా ఆ సంస్థ గతంలోనే ముందడుగు వేసింది. మిడిల్ ఈస్ట్, యూరప్, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, అమెరికా తదితర దేశాల్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తగిన నైపుణ్య శిక్షణ ఇస్తుంది. ఈ క్రమంలో టీఏకేటీ గ్రూప్తో ఏపీఎస్ఎస్ఓసీ, ఏపీఎన్ ఆర్టీఎస్లు ఒప్పందం కుదుర్చుకున్నాయి. టీఏకేటీ గ్రూప్ ప్రధానంగా వైద్యం, నిర్మాణం, ఆతిథ్య రంగాల్లోని అవకాశాలపై దృష్టి సారించింది. ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి వారికి ఆయా దేశాల భాషలపై ఉచితంగా శిక్షణ ఇస్తారు. వీసా ప్రక్రియ పూర్తయ్యాక విదేశాలకు పంపుతారు.
తాజాగా..
విదేశాల్లో నర్సింగ్ సిబ్బందికి డిమాండ్ బాగుండటంతో దానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. జపాన్లో నర్సులకు శిక్షణ ఇవ్వడానికి నావిస్ హెచ్ఎర్ ఇండో–జపాన్ ప్రోగ్రాంతో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ ఎస్ డీసీ) ఈనెల 23వ తేదీన అవగాహనా ఒప్పందం చేసుకుంది. స్కిల్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ (ఎస్ఐపీ) లో భాగంగా ఈ ప్రాజెక్టును పైలట్ కార్యక్రమంగా తీసుకున్నారు. ఇందులో జపనీస్ భాషపై, ఎన్1–ఎన్, జపనీస్ కేర్ గివింగ్, కేర్ టేకింగ్లపై శిక్షణ ఇస్తారు.
సీఎం ఆదేశాలతో..
చాలామంది సరైన స్కిల్స్ లేక ఉద్యోగాలకు దూరమవుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా 192 స్కిల్ హబ్స్, 26 స్కిల్ కాలేజీలు, స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చేందుకు ఏపీఎస్ ఎస్ డీసీ కృషి చేస్తోంది.