2018లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ ఎదుట ఏపీపీఎస్సీ సవాల్ చేసింది. దీంతో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే విధిస్తూ డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. తదుపరి విచారణను ఈనెల 27 కి వాయిదా వేసింది.
ఏపీపీఎస్సీ 2018లో 167 గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. పరీక్షలను విజయవంతంగా నిర్వహించి ఉద్యోగాలను కూడా ఇచ్చింది. కాగా అభ్యర్థుల ఎంపికలో ఎంపికలో అవకతవకలు జరిగాయని, మూడుసార్లు మూల్యాంకనం జరిగిందని కొందరు అభ్యర్థులు ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. ఏపీపీఎస్సీ స్పందిస్తూ డిజిటల్ మూల్యాంకనం రద్దు చేసి ఒకసారి మాత్రమే మాన్యువల్గా మూల్యాంకనం చేశామని వాదనలు వినిపించింది. కాగా ఏపీపీఎస్సీ వాదనలతో ఏకీభవించని సింగిల్ జడ్జి బెంచ్ మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ తీర్పు ఇవ్వడంతో ఇప్పటికే ఉద్యోగాలు చేసుకుంటున్న గ్రూప్ 1 ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు.
దీంతో ఏపీపీఎస్సీ డివిజన్ బెంచ్ ఎదుట సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేసింది. ఒక్కసారే మాన్యువల్గా మూల్యాంకనం చేసిన సీసీ కెమెరా ఫుటేజీలను డివిజన్ బెంచ్కు సమర్పించింది. దీంతో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే విధిస్తూ డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చి తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.