స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు విచారణ జరిపింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం దర్యాప్తును సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు అప్పగించినా అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ సందర్భంగా దర్యాప్తును సీబీఐకి అప్పగించినా అభ్యంతరం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా కౌంటర్ దాఖలు చేశారు.
2020లోనే సీఆర్డీఏ పరిధిలో జరిగిన అసైన్డ్ భూముల కుంభకోణం, ఏపీ ఫైబర్నెట్ కుంభకోణాలపై సీఐడీ దర్యాప్తు చేపట్టిందని, వీటిపై దర్యాప్తు చేయాలని సీబీఐని కోరామని ఇందుకు జీవోలు కూడా జారీ చేశామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మనీలాండరింగ్ కూడా జరిగిందని, ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన వ్యాజ్యంలో కోర్టు ఏ ఆదేశాలు జారీ చేసినా కట్టుబడి ఉంటామని తెలిపింది. కోర్టు ఆదేశాల మేరకు కౌంటర్ దాఖలు చేశామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్. శ్రీరామ్ తెలిపారు. ప్రతివాదులందరికీ నోటీసులు వెళ్లాక నివేదికపై నిర్ణయం తీసుకుంటామని, నోటీసులు అందని వారికి వాటిని అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉండవల్లిని ధర్మాసనంఆదేశిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.