జిల్లాల్లో తెలుగుదేశం, జనసేన నాయకుల మధ్య ఇష్టం లేని కాపురం జరుగుతోంది. తెలుగు తమ్ముళ్ల నుంచి జనసైనికులకు అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. తమ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడంతో వారు సర్దుకుపోవాలని చూస్తున్నా టీడీపీ నాయకులు చిన్నచూపు చూస్తూ అవమానిస్తూనే ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఆదివారం నారా లోకేశ్ ఎన్నికల శంఖారావం సభ జరిగింది. ఈ సమయంలో టీడీపీ, జనసేన నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. సభకు మీరు రావొద్దంటూ సేన నేతలతో తెలుగు తమ్ముళ్లు వాగ్వాదానికి దిగారు. వారిని అడ్డుకున్నారు.
దీంతో టీడీపీ నేతల తీరుపై సేన నేతలు తీవ్రంగా మండిపడి అవమానం జరిగిందంటూ వెళ్లిపోయారు. కొందరు సభలో సేన జెండాలు ఊపగా అవి కనిపించకూడదని దేశం నాయకులు హుకుం జారీ చేశారు. దీంతో జనసేన జెండాలకు.. ఆ తర్వాత కార్యకర్తలకు కూడా స్థానం లేకుండా పోయింది. ఇప్పుడే ఇలా ఉంటే రేపు భారతీయ జనతా పార్టీతో టీడీపీకి పొత్తు కుదిరితే ఇక తమను టీడీపీ పట్టించుకోదని, అసలు లెక్క పెట్టదని జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో జరిగిన సభల్లో అవమానాలు జరగ్గా తాజాగా మరో జిల్లా ఆ లిస్ట్లో చేరింది. ఇక అభ్యర్థుల జాబితాలు బయటికొచ్చి సభలు మొదలైతే టీడీపీ తమను ఎలా చూస్తుందోనని పవన్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.