ముఖ్యమంత్రి జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతుంది. పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు గత 3 ఏళ్లుగా దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. రాష్ట్రంలో రూ.4,178 కోట్లతో ఆదిత్య బిర్లా గ్రూప్, రిలయెన్స్ ఎనర్జీ, హెల్లా ఇన్ఫ్రా, వెసువియస్ ఇండియా లిమిటెడ్, ఏపీఐఐసీ, ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్కు సంబంధించిన మొత్తం 8 ప్రాజెక్టులకు బుధవారం వెలగపూడి సచివాలయం నుంచి వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అమర్నాథ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
2023 మార్చిలో విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో మొత్తం 13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు జరగ్గా 2.46 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన పనులు వేర్వేరు దశల్లో ఉన్నాయని పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. ఒక్క ఏడాదిలోనే ఏపీలో రూ. 2.46 లక్షల కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయని దేశవ్యాప్తంగా ఒప్పందాల్లో వాస్తవ రూపం దాల్చేది 17 శాతంలోపు ఉండగా ఏపీలో మాత్రం ఏపీలో ఏడాదిలోపే 19 శాతం వాస్తవ రూపంలోకి వచ్చాయని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా 11 పారిశ్రామిక కారిడార్లను నెలకొల్పుతుండగా ఏపీ పరిధిలో విశాఖ–చెన్నె, చెన్నె–బెంగళూరు, బెంగళూరు–హైదరాబాదు 3 పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటవుతున్నాయని, మౌలిక వసతుల కల్పనలో భాగంగా రూ.1,000 కోట్లతో నక్కపల్లి, శ్రీకాళహస్తి నోడ్లను జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని, ఈ రెండు పారిశ్రామిక పార్కుల ద్వారా సుమారు రూ.60,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని మంత్రి అమర్నాథ్ ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘంగా 974 కి.మీ. పొడవైన సముద్ర తీరాన్ని కలిగి ఉంది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సుమారు రూ.20 వేల కోట్లతో 4 ప్రధాన పోర్టులను నిర్మిస్తుండగా రామాయపట్నం పోర్టు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. మరో 4 వేల కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. స్థానిక యువత ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఇందులో భాగంగానే గత నాలుగేళ్లలో 2.50 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటు ద్వారా 6 లక్షల మందికి పైగా ఉపాధి దొరికిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు.