సీఎం జగన్ కు పులివెందుల ప్రాంతంలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్సార్ కడప జిల్లాలో ఒక్క రోజు పర్యటనలో భాగంగా సోమవారం రోజు ఇడుపులపాయ, పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేందుకు కడప విమానాశ్రయానికి వెళ్లిన సీఎం జగన్ కు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల నుండి ఘన స్వాగతం లభించింది. సీఎం జగన్ ను కలుసుకోవడానికి నేతలు తండోపతండాలుగా తరలి వచ్చారు.
కడప విమానాశ్రయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎస్ బి అంజాద్ బాషా, జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు, నగర మేయర్ కె. సురేష్ బాబు, ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ మళ్ళికార్జున రెడ్డి, ఎమ్మెల్సీలు పి. రామ సుబ్బారెడ్డి, ఎం. రామచంద్రా రెడ్డి, డి.సి. గోవిందరెడ్డి, రమేష్ యాదవ్, ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ్ రెడ్డి, రఘురామిరెడ్డి, దాసరి సుధ, మేడా వెంకట మల్లికార్జున రెడ్డి, సుధీర్ రెడ్డి ఇతర నాయకులు అధికారులు, తదితరులు పుష్పగుచ్ఛాలను ముఖ్యమంత్రి జగన్ కు అందజేసి ఘన స్వాగతం పలికారు.
పులివెందులలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆప్యాయంగా అందరిని పేరుపేరున పలకరించి పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేందుకు హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు. పులివెందుల పర్యటనలో భాగంగా తొలుత డాక్టర్ వైఎస్సార్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ను సీఎం జగన్ ప్రారంభిస్తారు.అనంతరం బనాన ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్ వైఎస్సార్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత డాక్టర్ వైఎస్సార్ జంక్షన్ కు వెళ్లి ప్రారంభిస్తారు. అక్కడే సెంట్రల్ బౌల్ వార్డ్ ప్రారంభించిన తర్వాత వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్ను ప్రారంభిస్తారు. పులివెందులలో గాంధీ జంక్షన్ను ప్రారంభించిన అనంతరం డాక్టర్ వైఎస్సార్ ఉలిమెల్ల లేక్ ఫ్రంట్ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆదిత్యా బిర్లా యూనిట్కు చేరుకుని ఫేజ్-1 ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి సంయూ గ్లాస్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఇడుపులపాయకు వెళ్లి వైఎస్సార్ మెమోరియల్ పార్కు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం వైఎస్సార్ ఎస్టేట్లోని గెస్ట్హౌస్కు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లికి చేరుకుంటారు.