తెలంగాణాలో బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)ని అంతగా బలం లేని పార్టీగా చెప్పుకోవచ్చు. గత ఏడాది తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో 108 స్థానాల్లో పోటీకి దిగిన బీఎస్పీ అన్ని స్థానాల్లోనూ ఓడిపోయి, కేవలం 1.08% ఓటు షేరును మాత్రమే సాధించగలిగింది. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు పొత్తు కుదుర్చుకుంది. ఈ పొత్తులో భాగంగా బీఎస్పీకి బీఆర్ఎస్ రెండు సీట్లు కేటాయించింది. పొత్తులో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలలోని నాగర్ర్నూల్తో పాటు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాల నుంచి బీఎస్పీ పోటీ చేయనుంది. నాగర్కర్నూల్ స్థానం నుంచి బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఎన్నికలో బరిలో దిగనున్నారు.
ఇప్పుడు ఈ పొత్తును చూసి జనసైనికులు తీవ్ర ఆవేదనలో రగిలిపోతున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు, విశాఖపట్నం జిల్లాలో జనసేన పార్టీ చాలా బలంగా ఉందని ఆ పార్టీనే పలు సందర్భాల్లో వెల్లడించింది. అంతేకాకుండా 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 5.53% ఓటు షేరు సాధించిన జనసేన కేవలం ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగలిగింది. కానీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓటమి పాలు కావడం గమనార్హం. జగన్ ను అధఃపాతాళానికి తొక్కేస్తానంటూ ఆవేశంగా మైక్ ముందు విరుచుకుపడిపోయే పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా కేవలం రెండు ఎంపీ సీట్లకు పరిమితం కావడాన్ని జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. మూడొంతులకు తగ్గకుండా సీట్లను అడుగుతానని బహిరంగంగా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన పవన్ కళ్యాణ్ కేవలం 24 అసెంబ్లీ 3 ఎంపీ సీట్లకే పరిమితం కావడం జనసైనికులకు మింగుడు పడడం లేదు.
చివరకి మూడు అసెంబ్లీ సీట్లు, ఒక ఎంపీ సీటును 2019 ఎన్నికల్లో 0.84 ఓటు షేరును మాత్రమే తెచ్చుకున్న బీజేపీకి త్యాగం చేయడం జనసైనికులు అసలు సహించలేక పోతున్నారు. 5.53% ఓటు షేరు సాధించిన జనసేనకంటే 0.84 సాధించిన బీజేపీకే ఎక్కువ ఎంపీ స్థానాలు దక్కడం, పవన్ కళ్యాణ్ త్యాగరాజులా మారిపోయి పార్టీలో సీట్లను ఆశిస్తున్న ఆశావహులకు మొండిచేయి చూపించడాన్ని తట్టుకోలేక జనసేన కేడర్ కక్కలేక మింగలేక అన్నట్లు ఇబ్బంది పడుతుంది. మరోవైపు ఏపీలో బీజేపీకన్నా తక్కువ ఎంపీ సీట్లకు చంద్రబాబుకు లొంగిపోవడం, పుండు మీద కారం చల్లినట్లు మరోవైపు తెలంగాణాలో ఒక్క శాతం ఓటింగ్ సాధించిన బీఎస్పీకి రెండు ఎంపీ సీట్లు దక్కడం జన సైనికులకు ఇబ్బందికరంగా మారింది. 1% ఓటు షేర్ ఉన్న బీఎస్పీకి రెండు ఎంపీ సీట్లు, 0.84% ఓటు షేర్ ఉన్న బీజేపీకి 6 ఎంపీ సీట్లు, 5.53% ఓటు షేరు ఉన్న జనసేనకు మాత్రం రెండు ఎంపీ సీట్లు కేటాయించారని జనసైనికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జనసేన పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన నేతలను పవన్ కళ్యాణ్ పక్కనబెడుతున్న విషయం తెలిసిందే. కాగా ఇలాగే ఇతర పార్టీల లబ్ది కోసం రాజకీయాలు చేస్తూ పొతే ఇంకెప్పుడు పార్టీ బలపడుతుందని జన సైనికులు ఆవేశంగా రగిలిపోతున్నారు. కానీ జనసైనికుల ఆవేదన పవన్ కళ్యాణ్ అర్థం చేసుకునే పరిస్థితులు మాత్రం ఇప్పట్లో ఉన్నట్లు కనబడటం లేదు.