ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్ తగిలింది. ఆమెను సీబీఐ కస్టడీకి ఇవ్వడానికి కోర్టు అనుమతించింది. దీంతో సీబీఐ హెడ్ క్వాటర్స్కు తరలించి ఆమెను ఈ నెల 15 వరకు ఆమెను దర్యాప్తు సంస్థ విచారించనుంది. తీహార్ జైలులో జ్యుడీషియల్ ఖైదీగా ఉన్న కవితను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు.
ఈ క్రమంలో కవిత అరెస్ట్ అక్రమమంటూ కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కుట్రదారుల్లో కవితది కీలక పాత్రని తనకు తెలిసిన వాస్తవాలను ఆమె దాచిపెడుతోందని, గతంలో కూడా ఆమె నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాలేదని సీబీఐ వాదనలు వినిపించింది. ఇరు వర్గాల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి భవేజా సీబీఐ వాదనలతో ఏకీభవించి కవితను మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఉత్వర్వులు జారీ చేశారు.
కస్టడీ సమయంలో ప్రతి రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులను, తన తరుఫు లాయర్లను కలిసేందుకు కవితకు కోర్టు అనుమతినిచ్చింది. కాగా సీబీఐ కస్టడీకి కవితను అప్పగించడం ఇప్పుడు ఆమెకు ఎదురుదెబ్బనే చెప్పాలి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ అరెస్టు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. కాగా మధ్యంతర బెయిల్ కోసం కవిత పెట్టుకున్న పిటిషన్ ను కోర్టు గతంలో తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ఆమె రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 20న విచారిస్తామని కోర్టు వెల్లడించింది.