సామాజిక, ఆర్ధిక అభివృద్దిని ప్రోత్సహించే లక్ష్యంతో దేశంలోని ప్రతి జిల్లా నుంచి ఒక ఉత్పత్తిని ఎంపిక చేసి, బ్రాండింగ్, విస్తృత ప్రచారం కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమమే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్.. ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేకించి చేతివృత్తులు, వివిధ కళారూపాలు బలోపేతం అవుతాయి. ఈ కార్యక్రమం కళాకారుల జీవనోపాధిని కూడా కాపాడి.. ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఎంతగానో తోడ్పడుతుంది.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ఓడీఓపీలో ఆంధ్రప్రదేశ్ కు 6 అవార్డులు దక్కాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ జామ్దాని చీరలు, అల్లూరి జిల్లా అరకు కాఫీకి బంగారు పతకాలు, పొందూరు కాటన్, కోడుమూరు గద్వాల్ చీరలకు కాంస్య పతకాలు, మదనపల్లె పట్టు, మంగళగిరి చేనేత చీరలకు ప్రత్యేక జ్యూరీ అవార్డులు దక్కాయి.
ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధికారులు ఈ అవార్డులు అందుకున్నారు. ఓడీఓపీలో ఆరు ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకోవడంలో ప్రతిభకనబర్చిన రాష్ట్ర అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసి అవార్డుల వివరాలను పరిశ్రమలు, వాణిజ్య శాఖ (చేనేత, జౌళి) శాఖ మంత్రి, ఉన్నతాధికారులువివరించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలు, వాణిజ్య (చేనేత, జౌళి) శాఖ ముఖ్య కార్యదర్శి సునీత, ఆశాఖ డైరెక్టర్ ఎం. ఎం. నాయక్, అధికారులు పెద్దిరాజు, సురేష్ కుమార్, ధర్మారావు, హరిక్రిష్ణ శ్రీనివాసరెడ్డి, వనజ తదితరులు పాల్గొన్నారు.