ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన వ్యూహం సినిమా రిలీజ్ మరింత ఆలస్యం కానుంది. వ్యూహం చిత్రాన్ని పునః పరిశీలించి మరోసారి రివ్యూ చేయాలని సెన్సార్ బోర్డు నిపుణుల కమిటీని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మూడు వారాల్లోపు చిత్రానికి సంబంధించిన కొత్త సెన్సార్ సర్టిఫికెట్ జారీ విషయంలో నిర్ణయం తీసుకోవాలని తేల్చి చెప్పింది. దీంతో వ్యూహం రిలీజ్ మరింత ఆలస్యం కానుంది.
రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన వ్యూహం సినిమా రిలీజ్ను నిలిపివేయాలంటూ టీడీపీ నేత నారా లోకేశ్ కోర్టును ఆశ్రయించారు. వ్యూహంలో పలు సన్నివేశాలు తన తండ్రి చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని వ్యూహం చిత్రానికి సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ చట్టవిరుద్ధమని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జనవరి 11 వరకు సెన్సార్ సర్టిఫికెట్ సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో ఆ మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిర్మాత దాసరి కిరణ్కుమార్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సినిమా వాయిదా వల్ల తీవ్ర నష్టం కలుగుతుందని, ఒకవేళ ఏపీలో జరగబోయే ఎన్నికలపై ప్రభావం ఉంటుందనుకుంటే తెలంగాణలో విడుదలకు అనుమతి ఇవ్వాలని దాసరి కిరణ్కుమార్ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. పిటిషనర్ల వాదనలు విన్న న్యాయస్థానం సెన్సార్ సర్టిఫికెట్ను పునఃపరిశీలించమని సెన్సార్ బోర్డును ఆదేశించింది.