ఒక దేశ ఉన్నతికి, దాని ఎదుగుదలకు కారణాలు ఎన్నో ఉండొచ్చు… కారకులు వేల మంది ఉండచ్చు… కానీ వాళ్లలో అతికొద్ది మంది మాత్రం దానిలో ఎక్కువ వాటా పొందటానికి అర్హులవుతారు… అందులో పీవీ మాత్రం భారత దేశానికి ఒక వేగు చుక్క…
ముఖ్యమంత్రి అవ్వడం, ప్రధాన మంత్రి అవ్వడం…. ఏది కూడా అదృష్టవశాత్తో, గాలివాటం గానో జరగలేదు.. ఆయన కుర్రాడిగా ఉన్నప్పటి నుండే రాజకీయం ఒంటబట్టిన మనీషి, ఉద్యమకారుడు కూడా…
దేశం మొత్తం బ్రిటిష్ పాలనలో మగ్గిపోతుంటే, హైదరాబాద్ రాజ్యం మాత్రం నిజాం పాలనలో మాడిపోతుండేది… బ్రిటిష్ రాజ్యం లో అయినా కాస్తో కూస్తో వాక్ స్వాతంత్ర్య ఉండేది, శాంతియుతంగా నిరసన అయినా తెలుపవచ్చు… నిజాం రాజ్యం లో అలాంటివేం ఉండవ్… అదో మధ్యయుగపు నాటి హింసాయుత బానిస రాజ్యం… నిజాం కి వ్యతిరేకంగా మాట్లాడక్కర్లేదు… మాట్లాడతారని ముందే అనుమానించి నోరు మూయిస్తారు… అలాంటి చోట, రోజూ ప్రేయర్ లో నిజాం ని పొగుడుతూ పాడాల్సిన గీతం బదులుగా, వందేమాతరం అంటూ నిజాం కి అస్సలు నచ్చని భారత ఉద్యమ గీతం పాడటం అంటే సాహసం అనే పదం చిన్నదేమో… ఎందుకంటే తను చదువుతున్న ఒస్మానియా యూనివర్సిటీ లోని సాక్ష్యాత్ విద్య నేర్పాల్సిన ప్రొఫెసర్లే…. “ దేశం లో 8 కోట్ల మంది ముస్లిం లు ఉన్నా, ఇంకా ఆవు మల మూత్రాలని పూజించే వాళ్ళని బతకనివ్వడం భారతీయ ముస్లిం లా చేతకాని తనం” అంటూ వాగే అంత ఉన్మాదం ఉన్నచోటది…. అయినా భయపడింది లేదు… యూనివర్సిటీ నుండి కట్టుబట్టల్తో తరిమేస్తే దేశంలో ఏ కాలేజీ కూడా వాళ్లకి అడ్మిషన్ ఇవ్వలేదు..సావర్కర్ సూచనల మేరకు నాగపూర్ యూనివర్సిటీ లో తర్వాత, పూణే లో తన “ లా “ పూర్తి చేసారు…
తర్వాత హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ వ్యవస్థాపనలో కీలక పాత్ర పోషించాడు..
రాజకీయ జీవితం:
హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనం అయ్యాక, దేశంలో మొట్టమొదటిసారి 1952 లో జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీ కి పోటీ చేసి ఓడిపోయారు….
తర్వాత ఆయన ఎప్పుడూ ఓటమి రుచి చూసింది లేదు..
1957 లో మొదటి సారి మంథని నుండి అసెంబ్లీ లోకి అడుగు పెట్టారు..
దామోదరం సంజీవయ్య క్యాబినెట్ లో లా మినిస్టర్ గా, కాసు బ్రహ్మానందరెడ్డి క్యాబినెట్ లో లా అండ్ ఎండోమెంట్ మినిస్టర్ గా, వైద్య శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా పని చేశారు… (1962 నుండి 1971 వరకు )
1969 లో కాంగ్రెస్ లో వచ్చిన చీలిక వల్ల పీవీ ఇందిర వైపు నిలబడ్డారు. 1969 లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన కారణం గా కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది… ఆయన స్థానం లో తెలంగాణా వ్యక్తి కావడం, అందులోనూ సమైక్యవాది అవ్వడం, ఇందిరా కి నమ్మకస్తుడు అవ్వడం చేత ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయిన నాలుగో వ్యక్తి గా, తెలంగాణ ప్రాంతం నుండి మొదటి వ్యక్తిగా పీవీ సీఎం అయ్యారు… రెండున్నరేళ్లకే జై ఆంధ్ర ఉద్యమం కారణం గా రాజీనామా చేయాల్సి వచ్చింది…
తర్వాత పూర్తిగా కేంద్ర రాజకీయాలలోనే ఉన్నారు.. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ క్యాబినెట్ లలో హోమ్ మంత్రిగా, విదేశాంగ మంత్రిగా భాద్యత నిర్వహించారు… విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ తో విదేశాంగ సంబంధాలు ప్రారంభించాడు…
ప్రధాని ఎలా అయ్యాడు?
1982 లో నే జ్ఞాని జైల్ సింగ్ కి ముందు పీవీ ని రాష్ట్రపతి ని చేయాలని ఇందిరా భావించింది. కానీ ఆనాటి సిక్కు సెంటిమెంట్ వలన జైల్ సింగ్ రాష్ట్రపతి అయ్యారు. 1991 లో రాజకీయాల నుండి శాశ్వాతంగా తప్పుకోవాలనుకున్నారు.. కానీ అనూహ్యంగా రాజీవ్ గాంధీ మరణం వల్ల, కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ గా నిలిచింది.. అప్పటికే దేశం ఆర్నెల్లకో ప్రధానమంత్రిని చూస్తుంది.. దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం గా ఉంది.. ఖజానా లో ఉన్న విదేశీ మారక నిల్వలు కేవలం నాలుగు రోజులు ఆయిల్ కొనడానికే సరిపోతుంది… ఇలాంటి సందర్భాల్లో ఎవరూ ప్రధాని పీఠం ఎక్కే సాహసం చేయలేదు.. కాంగ్రెస్ పీవీ ని ఒప్పించి ప్రధాని పీఠం లో కూర్చోబెట్టింది…
ప్రధానిగా:
పీఠం ఎక్కగానే, కాదు కాదు ఎక్కకముందే పీవీ కి తెలుసు తను కూర్చోబోతుంది ఒక ముళ్ల కుర్చీ మీదని… పేరుకు ప్రధాని, కానీ ఏ ఒక్కడికి కోపం వచ్చినా అవిశ్వాసం పెడితే గెలిచే అన్ని స్థానాలు లేవ్… ఇంకో పక్క గల్ఫ్ లో సంక్షోభం వల్ల ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి.. మన ఖజానాలో ఉన్న మొత్తం విదేశీ మారక ద్రవ్యం నాలుగు రోజులు ఆయిల్ కొంటే అయిపోతుందని…
ఐఎంఎఫ్ దగ్గరికి అప్పుకు వెళ్తే వాళ్లు ఇచ్చిన సలహా లేదా కండిషన్……..
దేశంలో ఆర్థిక సంస్కరణలు అవసరం అయ్యాయి… ప్రవేట్ వారి వ్యాపారాలకి స్వేచ్చనివ్వాల్సి వచ్చింది…. రాజకీయ అనుభవం లేని మన్మోహన్ సింగ్ ని, ఆర్థికవేత్త అనే కారణం చేత ఆర్థికమంత్రి గా నియమించాడు అప్పటికే, ఒక బోల్డ్ స్టెప్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది… 1991 జూలై లో దేశం లో ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు.. LPG ( లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్) ప్రవేశపెట్టారు….
ఆరోజు పీవీ తీసుకున్న ఆ నిర్ణయమే…. ఈరోజు మనం చూస్తున్న అభివృద్ధి… తెల్లారి లేస్తే మనం పెట్టుబడులు, కంపెనీ లు అంటూ మాట్లాడుకుంటున్నాం అంటే అది పీవీ పుణ్యమే… ఆయన లేకుంటే.. లైసెన్సింగ్, కోటా లు అంటూ ప్రైవేటు వ్యక్తి వ్యాపారమే చేయడం కష్టమయ్యేది…
ఆయన పుణ్యమే…ఎప్పుడూ 2%, 3% గ్రోత్ రేట్ తో ప్రొఫెసర్ రాజ్ కృష్ణ అన్నట్టు హిందూ గ్రోత్ రేట్ గా ఉన్న దేశం లో 2007-08 నాటికి డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ సాధించాం.. గత 6 ఏళ్లుగా (కోవిడ్ సమయం తీసేస్తే) భారత్ ఫాస్టెస్ట్ గ్రోయిన్ ఎకానమి గా చైనా కంటే ముందున్నాం…
భారత ఆర్థిక వ్యవస్థ కి ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ అంటే పివి ప్రధాని అవ్వడమే….పీవీ కి ముందు భారత్ వేరు… పీవీ తర్వాత భారత్ వేరు….
రక్షణ రంగంలో ఆయనది చెరగని ముద్ర:
ఇందిరా, రాజీవ్ క్యాబినెట్ లో రక్షణ మంత్రిగా చేసిన అనుభవం కారణం చేతనో ఏమో…. పీఎం అయినా 1993 నుండి ఆ శాఖని ఆయన వద్దే ఉంచుకున్నాడు అనుకున్నారు…. కానీ దేశానికి సంబంధించి రక్షణ విషయం లో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకూడదని ఆయన తీసుకున్న నిర్ణయం అది…
1974 లో న్యూక్లియర్ టెస్ట్ జరిగింది పోఖ్రాన్ లో అప్పటి ప్రధాని ఇందిరా, తర్వాత పాకిస్తాన్ మరింత అడ్వాన్స్ అవుతుంది అని హైడ్రోజన్ బాంబ్ తయారీకి ఇందిరా ప్రయోగాలు చేయాలని ఆదేశించింది…. 1981 నుండి ఆ పనులు మొదలయ్యాయి…. ఇందిరా, రాజీవ్ గాంధీ క్యాబినెట్ లో డిఫెన్స్ మినిస్టర్ గా ఆ ప్రయోగం గురించి అణువణువూ పీవీ కి తెలుసు…
అందుకే దేశ ఆర్థిక వ్యవస్థ కాస్త గాడిన పడగానే, ఆయన 1993 నుండి మళ్లీ ఆ ప్రయోగాలని ప్రారంభించి దాదాపు పూర్తి చేశాడు… ప్రధానిగా దిగిపోతూ 1996 లో వాజ్పేయీ కి ఈ ప్రయోగాల గురించి వివరించగా తర్వాత ఆయన దాన్ని కొనసాగించి రెండో సారి బుద్ధుణ్ణి నవ్వించారు…. (ఇది వాజ్పేయే చెప్పిన మాట)
పోఖ్రాన్-II లో వాజ్పేయీ కి ఎంత క్రెడిట్ దక్కుతుందో పీవీ కి అంతే దక్కాలి…
1992 డిసెంబర్ 6:
ఆరోజు పీవీ చాలా శూన్యం గా ఉన్నారు, మొహం లో ఎలాంటి భావాలు కనిపించడం లేదు.. తన కార్యదర్శిని పిలిచి, ఈరోజు సాయంత్రం వరకూ ఎంత ఉపద్రవం ఎదురైనా, ఏం జరిగినా నన్ను పిలవద్దు, కదిలించవద్దని పూజకు కూర్చున్నారు… సాయంత్త్రం వరకూ పూజలోనే ఉన్నారు….
అదే రోజు ఢిల్లీ కి 666 కిలోమీటర్ల దూరం లో ఉన్న అయోధ్యలో బాబ్రీ మసీదు నేలమట్టం అవుతుంది… సాయంత్రం వరకూ ఆ తతంగం కొనసాగుతూనే ఉంది కానీ పీవీ మాత్రం పూజలో అలానే ఉండిపోయారు….
బాబ్రీ మసీదు నేలమట్టం అయింది దేశం లో అల్లర్లు…. తర్వాత ముంబై లో పేలుళ్లు……. వీటన్నిటిని బాగానే హ్యాండిల్ చేయగలిగారు…
కానీ… బాబ్రీ మసీదు కూల్చివేత ఆయనకు తెలిసే జరిగిందని…. తెలిసినా ఆయన ఆపాలి అనుకోలేదని… ఆయన పరోక్షంగా దానికి సహకరించారని ఆయన జీవితం లోనే అతిపెద్ద మచ్చ పడింది…. అదొక్కటే ఆయన ఎదుర్కున్న ఏకైక విమర్శ…
ఈ విషయాలన్నీ ఆయన….అయోధ్య: డిసెంబర్ 6, 1992 అనే పుస్తకంలో వివరించారు….
పండితుడు పీవీ:
పీవీ రాజకీయ నాయకుడే కాదు, గొప్ప పండితుడు కూడా… ఒక్క భాష లో కాదు మొత్తం 17 భాషలు మాట్లాడగలరు ఆయన, కోబాల్, బేసిక్, యూనిక్స్ వంటి కంప్యూటర్ ల్యాంగ్వేజ్ లలో ప్రోగ్రామింగ్ కూడా రాసేవారంటే నమ్మగలరా?
విశ్వనాథ సత్యనారాయణ రాసిన వేయి పడగలని “ సహస్రఫ్ఫన్ “ పేరుతో హిందీ లోకి తర్జుమా చేసారు..
విదేశాంగ విధానం మీద ఇండియా అండ్ ఆసియా పసిఫిక్ అనే గ్రంథం రాశాడు… లుక్ ఈస్ట్ పాలసీకి పీవీ నే ఆద్యుడు..
టువార్డ్స్ న్యూక్లియర్ వెపన్ ఫ్రీ అండ్ నాన్ వైయలెంట్ ఇండియా,..ఏ లాంగ్ వే, లాంటివి ఆయన ఇతర రచనలు…
ఆయన తన ఆత్మకథను “ ది ఇన్సైడర్ “ పేరుతో రాశారు….
కాంగ్రెస్ తో విభేదాలు: చివరి రోజుల్లో పీవీ:
ప్రధాని పదవి లో ఉండగానే సోనియా గాంధీతో తో విభేదాలు ఏర్పడ్డాయి… సోనియా గాంధీ జోక్యం ప్రభుత్వం లో నచ్చని ఆయన, కాంగ్రెస్ పార్టీ దేశానిది కానీ, గాంధీ కుటుంబానిది కాదనీ కాంగ్రెస్ నాయకుల ముందు అనేవాడు.. అది నచ్చని సోనియా పీవీ మీద కోపం పెంచుకుంది… 1996 తర్వాత ఆయన అనుభవాన్ని ఏనాడూ పార్టీ కోసం వాడుకుంది లేదు… ఆయన పరమపదించిన తరువాత… పార్ధివ దేహ ఊరేగింపు సోనియా ఇంటి ముందు నుండే వెళ్తున్నప్పటికీ బయటికి వచ్చి కూడా నివాళులు అర్పించనేలేదు… భారత దేశానికి, కాంగ్రెస్ పార్టీ కి, ప్రధాని పదవికి ఎంత చేసినా పీవీ సమాధికి ఢిల్లీ లో చోటు లేకపోయింది… ఢిల్లీ లో సమాధి లేని ఏకైక ప్రధాని పీవీ నరసింహారావే….
అయినా పర్వాలేదు… పీవీ మా తెలుగోడు…. మా మనిషి… ఆ మహానుభావుడి సమాధి మా దగ్గర నే ఉండాలిలే….
కానీ ఆయన గొప్ప రాజకీయం నాయకుడు, అంతకు మించి గొప్ప నాయకుడు, దానికి మించిన గొప్ప ప్రధాని, అంతకు మించి ఓ గొప్ప దేశ భక్తుడు….
భారతరత్న
” శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు”
The man “ Who Made India “…..