రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కు నేటికి 42 ఏళ్లు
స్వాతంత్ర్యానంతరం భయంకరమైన బ్రిటిష్ పాలనా అనుభవాల దృష్ట్యా దేశాన్ని కార్పోరేట్ వ్యవస్థల చేతిలో పెట్టే ఉద్దేశం లేని ఆనాటి నాయకత్వం 1948 లో దేశ ఆర్ధిక వ్యవస్థను మిశ్రమ ఆర్థిక వ్యవస్థ గా ప్రకటించి, అందులోనూ ముఖ్యమైన ఉత్పత్తులపై ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని తీసుకున్నది.. దానిలో భాగం గానే రెండో పంచవర్ష ప్రణాళిక లో భారీ పరిశ్రమల వ్యూహాన్ని ఎంచుకుని దేశంలో ప్రభుత్వమే పెద్ద తరహా భారీ పరిశ్రమల ఏర్పాటు చేయడం ప్రారంభించింది…
అనాటి పశ్చిమ జర్మనీ సహకారంతో రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం (ఒడిశా), రష్యా సహకారం తో బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారం(ఛత్తీస్ఘడ్), బ్రిటన్ సహకారంతో దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారం(బెంగాల్) మొత్తం మూడు ఇనుము ఉక్కు కర్మాగారాలు నిర్మాణం ప్రారంభం అయ్యాయి… తర్వాత మూడో పంచవర్ష ప్రణాళిక కాలం లో రష్యా సాయం తో బొకారో ఇనుము ఉక్కు పరిశ్రమ (బీహార్) లో నిర్మాణం ప్రారంభించింది ప్రభుత్వం…
ఇలా దేశంలో నాలుగు భారీ స్థాయి ఇనుము ఉక్కు కర్మాగారాలు నెలకొల్పినా దేశం లో ఉక్కు కొరత ఉంది. భవిష్యత్తు అంచనాల దృష్ట్యా ఇవి సరిపోవని ప్రభుత్వానికి ఉన్న అంచనా ప్రకారం ఇంకో ఉక్కు పరిశ్రమని నెలకొల్పాలని ప్రభుత్వం భావించి ఆంగ్లో అమెరికన్ కన్సార్టియం ద్వారా సర్వే చేయించగా అది తీరం కలిగి రవాణా కు, బొగ్గు దిగుమతికి అనుకూలంగా ఉన్న విశాఖపట్నం అనువైన చోటని నివేదికనిచ్చింది…
దక్షిణ భారత దేశం లో ఎక్కడైనా ఆమోదయోగ్యమే అని అప్పటికే గనుల శాఖా మంత్రి గా ఉన్న నీలం సంజీవ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక ఆంగ్లో అమెరికన్ కన్సార్టియం కూడా విశాఖపట్నం అనుకూలమని నివేదిక ఇచ్చిన తరుణం లో పారిశ్రామికంగా వెనుకబడి ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో ఎప్పటి నుండో పరిశ్రమలు నెలకొల్పాలని ఉన్న డిమాండ్ దృష్ట్యా ఇక్కడ కర్మాగారం ఏర్పాటు జరిగితే తమకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలుగు ప్రజానీకం భావించింది…
అయితే కొత్తగా ఏర్పాటు చేయబోయే ఇనుము ఉక్కు పరిశ్రమ తమ రాష్ట్రం లో ఏర్పాటు చేయాలని తమిళనాడు కు చెందిన కామరాజ్ నాడార్, కర్ణాటక కు చెందిన నిజలింగప్ప లు కేంద్రం వద్ద లాబీయింగ్ మొదలు పెట్టారు, మరో పక్క పీవీ రాజమన్నార్ అధ్యక్షతన ఏర్పాటైన నాలుగో ఆర్ధిక సంఘం కొత్తగా ఏర్పాటయ్యే ఇనుము ఉక్కు కర్మాగారానికి విశాఖ కన్నా గోవా లేదా కర్ణాటక లోని హోస్పెట్ అనుకూలం అని అభిప్రాయపడింది…
ఈ సందిగ్దతల మధ్య తెలుగు ప్రజల్లో అనేక అనుమానాలు, భయాలు మొదలయ్యాయి. కొత్తగా ఏర్పాటయ్యే ఉక్కు కర్మాగారం విశాఖ లోనే ఏర్పాటు చేయాలని ఆందోళన బాటపట్టారు.. ఈ నేపథ్యం లో గుంటూరు జిల్లా తాటికొండ శాసనసభ్యుడైన అమృతరావు 15 అక్టోబర్ 1966న విశాఖలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరుతూ విశాఖ కలెక్టరేట్ ఎదురుగా నిరాహార దీక్ష పూనారు. అమృతరావు నిరాహారదీక్ష 12వ రోజు చేరడంతో అమృతరావుకు మద్దతుగా తిరుపతి వెంకటేశ్వరా యూనివర్సిటి ఇంజినీరింగ్ కాలేజీ విధ్యార్ధులు విశాఖ ఉక్కు ఆంద్రుల హక్కు అనే పేరున ఒక కరపత్రం విడుదల చేసి రాష్ట్రానికి ఉక్కు పరిశ్రమ ఎందుకు అవసరమో వివరించారు.
ఉద్యమం ఉవ్వెత్తున లెగిచిపడటంతో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఇందిరా గాంధీ కి పరిస్థితిని వివరించగా, విశాఖలో ఐదవ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సమస్య పరిశీలించడానికి ఇందిరా గాంధి 28 అక్టోబర్ 1966న మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. అయితే ఆ రెండు మూడు రోజులోనే రాష్ట్రంలో ఉధ్యమం ఉదృతమై అన్ని జిల్లాల ప్రజలు విధ్యార్ధి సంఘాలు , ప్రజాపార్టీ సారధి తెన్నేటి విశ్వనాధం, వావిలాల , నాగిరెడ్డి, గౌతు లచ్చన్న తదితరులు ఉద్యమం లో భాగస్వాములయ్యారు… ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటం తో ఆందోళనలు తీవ్రతరం అవ్వగా, ఈ ఉద్యమం లో పాల్గొన్న 32 మంది పోలీస్ కాల్పుల్లో అమరులయ్యారు..
ఇందిరా గాంధీ నియమించిన మంత్రివర్గ ఉపసంఘం విశాఖలో ఉక్కు కర్మాగారాన్ని సమర్దించడంతో విశాఖలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఇందిరాగాంధి నుంచి హామీ రావడంతో 1966 నవంబర్ 3న ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి నిమ్మరసం ఇవ్వగా అమృతరావు దీక్ష విరమించారు. దీక్ష విరమించిన కొద్ది రోజులకే ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి మెరుగయ్యాకే విశాఖ ఉక్కు కర్మాగారం మొదలు పెడతాం అని ఇందిరా గాంధీ ప్రకటించడంతో, ఇది ప్రజలను మోసం చేయడమేనని 1967 లో జరిగిన ఎన్నికల్లో ” విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ” నినాదం తో విశాఖ నుండి తెన్నేటి విశ్వనాథం గారు స్వాతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిపై గెలిచారు.. దీని తర్వాత మూడేళ్లకు అనగా 1970 లో ప్రజల అభీష్టం మేరకు విశాఖపట్నం లో ఉక్కు కర్మాగారాన్ని నిర్మిస్తామని ఇందిరా గాంధీ ప్రకటించింది.. 1971 జనవరి 20న ప్లాంటు నిర్మాణానికి ప్రధాని ఇందిరా గాంధి శంకుస్థాపన చేశారు. 1982 ఇదే రోజు లో మొదటి బ్లాస్ట్ ఫర్నేస్ నిర్మాణం మొదలు కాగా, విశాఖ ఉక్కు కర్మాగారానికి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (RINL) గా నామకరణం చేసారు.. పూర్తి స్థాయిలో దాని నిర్మాణం పూర్తి అయి, ఉత్పత్తి మొదలు పెట్టే స్థాయికి చేరుకోవడానికి 1992 వరకు సమయం పట్టింది.. 1992 ఆగస్ట్ 1 నాడు ప్రధాని పీవీ నరసింహారావు గారు విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని జాతికి అంకితం చేసారు..
ప్రారంభం నుండి వరుసగా లాభాలను ఆర్జిస్తూ 2006 లో మినీ రత్న హోదాను, దాని తర్వాత రెట్టించిన లాభాల బాటలో ఉరకలెత్తి కేవలం మూడేళ్లలోనే నవరత్న హోదాను పొందింది…
అయితే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కుని లాభాలు పొందిన విశాఖ ఉక్కు కర్మాగారం 2019-20 నాటికి వరుసగా మూడేళ్లు అత్యధిక నష్టాలు చవిచూసింది.. 2019-20 నాటికి సంస్థకి 3696 కోట్ల నష్టం రాగా, కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానం లో భాగంగా త్వరలోనే విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని (RINL) ప్రైవేటీక్రించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం 2021 లో ప్రకటించింది.. వివిధ వర్గాల నుండి వస్తున్న నిరసన దృష్ట్యా, రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకూ ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని నిలుపుదల చేసింది. కానీ భవిష్యత్తు లో మళ్లీ ప్రైవేటీకరణ అంశం మళ్లీ తెరపైకి రావొచ్చు …
ఆశ్చర్యకరంగా 2021 లో 18000 కోట్ల టర్నోవర్ నీ, 2022 ఆర్ధిక సంవత్సరం లో ఉత్పత్తి ప్రారంభం అయినప్పటి నుండీ ఎన్నడూ లేని విధంగా 28,215 కోట్ల టర్నోవర్ ను సాధించింది…
ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ప్రస్తుతం భారత్ లో అత్యంత నాణ్యమైన ఇనుము- ఉక్కును తయారు చేసే సంస్థ మన వైజాగ్ స్టీలే…
ఎందరో త్యాగాల ఫలితంగా హక్కులా సాధించుకున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకూడదని ఆశిద్దాం…